ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ తిరుపతి ఉప ఎన్నిక . ఎంపీగా గెలుపొందిన వైసీపీ నేత ఆకస్మికంగా కన్ను మూయడంతో తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగబోతుంది.
ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ అన్ని పార్టీలు ముందస్తుగా సిద్ధం అవుతున్నాయి. అందరికంటే ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ – జనసేన పార్టీలు తమ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఏ పార్టీ బరిలో ఉంటుందో కూడా డిసైడ్ అవలేకపోతున్నాయి. అయితే, అధికార వైసీపీ దూకుడుగా ఉందంటున్నారు.
వైసీపీ కొత్త గేమ్ …
2019 ఎన్నికల్లో తిరుపతి నియోజక వర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంనది. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని పార్టీ చూస్తోంది. డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. మరోవైపు ఎన్నికల వ్యూహాలు సైతం సిద్ధం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యనేతలు సమావేశమయ్యారు. తిరుపతిలో పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చించారు.
ఇటు పార్టీ అటు ప్రభుత్వం
తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఇటు పార్టీ అటు ప్రభుత్వ పరంగా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే ఈనెల 25 వ ఇళ్లపట్టాల పంపిణి కార్యక్రమం కూడా తిరుపతిలోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత డిసెంబర్ 27 వ తేదీన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా తమ సిట్టింగ్ సీట్ను సొంతం చేసుకునేందుకు షెడ్యూల్ కూడా రాకముందే సీఎం జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారని అంటున్నారు.