తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాజకీయ వ్యూహకర్త అనే పేరున్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ఎత్తుగడలతో ఆయన ముందుకు సాగుతుంటారు. అయితే, గత కొద్దికాలంగా ఒకింత గడ్డుకాలం ఎదుర్కుంటున్నారు.
తాజాగా సొంత పార్టీలోనే ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు. ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి కేంద్రంగా ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు.
ఏమండోయ్ నాని గారు
రాజధాని ప్రాంతమైన కృష్ణా , గుంటూరు జిల్లాల్లో రాజకీయంతో చంద్రబాబు ఇరుకున పడుతున్నారట. విజయవాడకు చెందిన ఎంపీ కేశినేని నాని గురించే ఇదంతా. కృష్ణా జిల్లాలోని సొంత పార్టీ నాయకులతో కేశినేని నానికి పడదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే సొంతవాళ్లపై తీవ్రమైన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమతో విభేదాలు.. రవాణా కమిషనర్తో వాగ్వాదం వాటిల్లో కొన్ని. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాని మధ్య ట్విటర్లో పెద్దవారే జరిగింది. తర్వాత కొంత తగ్గిన నాని.. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకుని బెజవాడ ఎంపీ అయ్యారు. లోక్సభకు ఎన్నికయ్యారు కానీ.. టీడీపీలో ఉన్నప్పటికీ ఆయనకు పార్టీ నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది.
టీడీపీలో నాని పరిస్థితి ఏంటో తెలుసా?
కేశినేని నానికి ఇప్పుడు టీడీపీలో కష్టకాలం ఎదురవుతోందని అంటున్నారు. టీడీపీ ఇటీవల ప్రకటించిన కమిటీలలో ఏ ఒక్కదానిలో కూడా కేశినేనికి చోటు దక్కలేదు. దీంతో సిట్టింగ్ ఎంపీని టీడీపీ పక్కన పెట్టిందా? లేక ఆయనే పార్టీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా? అనే చర్చ మొదలైంది. పార్టీ పదవులకు కూడా దూరం చేసేందుకు రాజకీయాలే కారణమని చెప్తున్నారు.
ఆ ఎంపీతో ఏం జరిగిందంటే…
వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయంతో కేశినేని నాని హర్ట్ అయ్యారని అంటున్నారు. 2019లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక సమయంలోనే కేశినేని నాని అలకబూనారు. తనతోపాటు రెండోసారి గుంటూరు నుంచి గెలిచిన గల్లా జయదేవ్కు ఆ పదవి ఇవ్వడంతో కినుక వహించారు. ఇప్పుడు టీడీపీ కమిటీలలోనూ గల్లాకు ప్రాధాన్యం దక్కింది. గల్లాను పొలిట్బ్యూరో సభ్యుడిని చేయడం నాని జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే సైలెంట్ అవుతున్నారని అంటున్నారు. అయితే, రాజధాని ప్రాంతంలో ఇలాంటి పరిస్థితిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్తున్నారు.