తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చెవులకు చిల్లులు పడేలా చేసిన ప్రచారం ముగిసింది. రేపు (డిసెంబర్ 1వ తేదీ)న పోలింగ్ జరగనుంది.
ఇప్పటి వరకు మాటల మధ్య ఆరోపణలు, విమర్శలకు ఫులిస్టాప్ పడింది. సవాల్లు, ప్రతిసవాళ్లు, మైకుల హోరు నినాదాలు జోరుకు బ్రేక్ పడిపోగా ఇక, సైలెంట్గా తమ పని చేసుకోవడంపై అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డబ్బులు పంచుతూ.. వివిధ పార్టీలకు చెందిన నేతలు పట్టుబడ్డారు. ఇదే సమయంలో అధికారులు పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్నికల లెక్క ఇది…
గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 వార్డుల బరిలో 1,122 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఇందులో టీఆర్ఎస్ నుంచి 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సిపిఐ 17, సిపిఎం 12, రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415గా బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 74,67,256గా ఉండగా అందులో పురుషులు 38,89,637 మంది ఓటర్లు, స్త్రీలు 30,76,941, ఇతరులు 415గా ఉన్నారు. మొత్తం 36,404 సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ అధికారులు 9101, సహాయ పోలింగ్ అధికారులు 9101, ఇతర పోలింగ్ సిబ్బంది 18,202 మంది విధులు నిర్వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది.
వాళ్లంతా వెళ్లిపోవాల్సిందే….
గ్రేటర్ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ బయట నుంచి వచ్చిన వాళ్లు.. వెంటనే హైదరాబాద్ను విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా వెళ్లి పోవాలని సూచించిన ఎన్నికల సంఘం… పోటీ చేస్తున్న వ్యక్తికి ఒకే వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఏజెంట్లకు ప్రత్యేకంగా వాహనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అభ్యర్థి వాహనంలోనే ఏజెంట్లు ప్రయాణం చేయొచ్చని సూచించింది. మరోవైపు.. ఇవాళ సాయంత్రం 6 గంటలకే మద్యం షాపులు క్లోజ్ కాగా.. డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు బంద్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.