ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఇలాకా అయిన రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నేతలనే కలవరపరుస్తున్నాయి.
ఇక జిల్లా తర్వాత మరో జిల్లా అన్నట్లుగా సీమలో జరిగే వివాదాలు మారుతున్నాయంటున్నారు. సొంత జిల్లా కడప, ఆ పక్కనే ఉన్న కర్నూలు జిల్లాలోని ఘటనలు దీనికి నిదర్శనం.
సొంత ఇలాకాలో ఏంటిది జగన్?
వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఓ నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. కొండాపురం మండలం పి.అనంతపురంలో రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.. ఈ ఘటనలో గురు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ రగాయాలయ్యాయి. గండికోట నిర్వాసితులకు చెక్కుల విషయంలో రీ సర్వే చేస్తుండగా వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దారితీసింది.. అప్పటికే తెచ్చుకున్న కర్రలతో దాడులు చేసుకున్నారు.. ఈ ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.. పి.అనంతపురం గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.. మరోవైపు పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారికి తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు.
కర్నూలులో…
ఇక కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే శ్రీదేవి, పార్టీ నేత పోచం మురళీధర్రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పర దాడులతో ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.మరోవైపు ఈ ఘటనలు వైసీపీ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సీమలోని పరిణామాలపై పార్టీ పెద్దలు దృష్టి సారించాలని పలువురు చర్చించుకుంటున్నారు.