తెలుగుదేశం పార్టీ … తెలంగాణలో ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడుందో బూతద్దం వేసి వెతకాల్సిన పరిస్థితి. ఒక్కప్పుడు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పట్టున్న తెలుగుదేశం పార్టీ పూర్తి చతికిలపడిపోయింది.
తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా సాధించలేకపోయిన ఆ పార్టీ కనీసం చెప్పుకోదగ్గ ఓట్లను రాబట్టుకోలేకపోయింది. ఈ ఫలితాలు వచ్చి రెండు రోజులు గడుస్తున్న ఇప్పటికీ టీడీపీ అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు కానీ… ఆయన తనయుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కానీ స్పందించలేదు. అయితే, తజాగా టీడీపీ సానుభూతిపరులు కొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టారని అంటున్నారు. అదే జూనియర్ ఎన్టీఆర్ రీ ఎంట్రీ.
దివంగత ఎన్టీఆర్ హయాంలో….
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ వల్ల తెలంగాణలో టీడీపీకి భారీ స్థాయిలో పట్టు ఉండేది. 1983 జనవరి 5న తొలిసారి రాజ్యాధికారం చేపట్టిన ఎన్టీఆర్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి దాకా తెలుగునేలపై ప్రతి గ్రామంలో మునసబు, కరణం పెత్తనం సాగుతూ వచ్చింది. దానికి అప్పటి రామారావు ప్రభుత్వం చరమగీతం పాడింది. పటేల్, పఠ్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఎన్టీఆర్ నిర్ణయం తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంది. దాంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పట్ల జనానికి విశ్వాసం కలిగింది. దీంతో పాటుగా ఎన్టీఆర్ సోషల్ ఇంజినీరింగ్ చేశారు. ఎంతోమంది కొత్తవారిని ప్రోత్సహించారు. బలహీన వర్గాల వారికి టికెట్లు ఇచ్చారు. అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీ అనగానే బలహీన వర్గాల పార్టీ అన్న పేరు సంపాదించి తెలంగాణలో బలమైన క్యాడర్ గల పార్టీగా తెలుగుదేశం నిలిచింది.
చంద్రబాబు హయాంలో
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ భారీగా నష్టపోవడం మొదలైంది. తర్వాతి క్రమంలో వేగంగా దిగజారుతోంది. రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 15 సీట్లు సంపాదించింది. 2018 ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకు, అదీ ఖమ్మం జిల్లాలోనే ఆ రెండు సీట్లు రావడం జరిగింది. ఇక హైదరాబాద్ నగరంలో అంతకు ముందు తెలుగుదేశం పార్టీ సీమాంధ్రులు ఉన్న ప్రాంతాల్లో బలంగా ఉండేది. ఆ బలం 2014 ఎన్నికల్లోనూ కనిపించింది. అయితే 2018 ఎన్నికల్లో ఆ బలం కనిపించలేదు. పైగా నగరంలో పట్టున్న స్థానాలను సైతం భారీ తేడాతో చేజార్చుకుంది. 2016లో జరిగిన హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికల్లోనూ ఒకే ఒక్క కేపీహెక్బీ కార్పోరేటర్ ను మాత్రమే దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఈ సారి 106 కార్పోరేట్ స్థానాలకు పోటీ చేసినా, ఒక్క సీటునూ సంపాదించలేకపోయింది.
ఎన్టీఆర్ కుటుంబం అంటూ
తెలంగాణలో బలపడాలంటే ఇదే జరగాలి అంటూ తాజాగా సోషల్ మీడియాలో కొందరు టీడీపీ మద్దతుదారులు ఓ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడైన దివంగత యన్టీఆర్ ఫ్యామిలీలోని వారే ఇక్కడ పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో హరికృష్ణ కూతురు సుహాసినిని కూకట్ పల్లిలో చాన్స్ ఇచ్చినట్లే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఇవ్వాలంటున్నారు. నందమూరి కుటుంబంలోనూ జనాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న జూనియర్ యన్టీఆర్ లాంటివాళ్ళు వస్తేనే పార్టీ ఇక్కడ బతికి బట్టకలుగుతుందని లెక్కలు వేస్తున్నారు. అయితే, గతంలో సుహాసినికి కూకట్పల్లిలో ఘోరపరాజయం తప్పలేదు. ఆ తర్వాత ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ ఆమెకు ఏ పదవి చంద్రబాబు కేటాయించలేదు. అలాంటిది సినిమాల్లో నటిస్తూ, సినీరంగంలో ఎంతో భవిష్యత్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వస్తే… అందులోనూ జీరో స్థాయికి దగ్గర్లో ఉన్న తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపడితే.. బకారా అయిపోతారని ఇంకొందరు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు.