తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న సఖ్యత గురించి, కొద్దికాలం కిందట నీటి వివాదం నేపథ్యంలో ఏర్పడిన గ్యాప్ గురించి పరిచయం చేయనవసరం లేదు.
అయితే, మరో దీర్ఘకాలిక అంశంపై ఈ ఇద్దరు సీఎంల నిర్ణయం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే ఆర్టీసీ సేవలు. ఏపీ తెలంగాణ మధ్య గత కొద్దికాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ సేవలపై తుది నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
కరోనా నాటి నుంచి మొదలు….
కరోనా కలకలం, లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనల్లో సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు అనేకమార్లు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం కాలేదు. వివిధ రూట్లలో బస్సులు, వివిధ ప్రాంతాల్లో సర్వీసుల విషయంలో ఏపీ తెలంగాణ అధికారుల మధ్య స్పష్టత రాలేదు. అయినప్పటికీ, తెలంగాణ చెప్పిన విధంగా బస్సులు నడిపేందుకు ఇప్పటికే ఏపీ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపేందుకు ఏపీ అధికారులు అంగీకరించారు. రూట్ల విషయంలోనూ తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ ఓకే చెప్పింది. దీని ప్రకారం విజయవాడ-హైదరాబాద్ రూట్లలో ఏపీ ఆర్టీసీ కంటే తెలంగాణ ఆర్టీసీ ఎక్కువ బస్సులు తిప్పుతుంది. ఈ విషయంలో తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
నేడు కీలక సమావేశం
ఏపీలోని మిగిలిన రూట్లలోనూ తెలంగాణ బస్సులు నడిపేందుకు ఏపీ రవాణా అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రతిపాదనలను అంగీకరించమని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఇరు రాష్ట్రాల అధికారులు నేడు మరోసారి చర్చలు జరపబోతున్నారు. ఈ చర్చల్లో వివాదం ముగిసి బస్సులు నడవనున్నట్లు సమాచారం.