తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయన వ్యూహాలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా ఆయన గేమ్ ఏంటనే చర్చ వినిపిస్తోంది.
జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. బీజేపీపై అనేక విమర్శలు చేసింది. ఎన్నికల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. మూడ్రోజుల ఈ పర్యటనపైనే తాజా చర్చ జరుగుతోంది.
వాళ్లు మొదలుపెట్టేశారు
ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనేక విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ బీజేపీ నేతలకు వొంగి వొంగి ఎందుకు నమస్కారం పెడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీపై యుద్ధం చేయడం అంటే ఇదేనా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు అని అన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని, చిత్తశుద్ధి ఉంటె రైతులకు మేలు చేయాలని అన్నారు. రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రైతు రుణమాఫీ చేయలేదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.
కేసీఆర్ ఏం చేస్తున్నారు?
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో అనేకమంది కేంద్రమంత్రులను కేసీఆర్ కలిశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విమానాశ్రయం తదితర విషయాలను గురించి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా అయన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక విషయాల గురించి చర్చించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దేశ రాజధానిలో స్థలం కేటాయించనందుకు అయన కేంద్ర పట్టణాభివృద్ధి, పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తెలంగాణలోని సిద్ధిపేట, వరంగల్ లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనీ పౌరవిమానయాన శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లగా తమపై ఇలాంటి విమర్శలు చేయడం ఏంటని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.