దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలో రమేష్ హాస్పిటల్స్ అగ్ని ప్రమాదం గురించి తెలిసిన సంగతే. స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్-19 సెంటర్ ఏర్పాటు చేయడం, అనంతరం జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20 మంది గాయపడటం అనేక మందిని నివ్వెరపరిచింది.
ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ ఘటనలో కీలక పరిణామం తెరమీదకు వచ్చింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి డా.రమేష్బాబును ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతించింది.
అసలేం జరిగింది?
కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రైవేటు కేంద్రాలకు సైతం అనుమతి ఇచ్చింది. ఇలా అనుమతి పొందిన వాటిలో విజయవాడలోని స్వర్ణప్యాలెస్ ఒకటి. అయితే, రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఆగస్టు 9న భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అగ్ని ప్రమాదం వల్ల 10 మంది చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు డాక్టర్ రమేశ్ బాబు సహా పలువురిపై కేసులు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి నుంచి రమేష్ బాబు పోలీసులకు అందుబాటులోకి రాలేదు.
అప్పటి నుంచి అజ్ఞాతంలోనే…
అగ్ని ప్రమాదం, తదుపరి విచారణ నేపథ్యంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆస్పత్రి ఎండీ రమేష్బాబు, సీతారామ్మోహన్రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. తాజాగా విచారణకు అనుమతిచ్చింది. మూడు రోజుల పాటు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లో విచారణ చేయొచ్చని పేర్కొంది. ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని సూచించింది. కోవిడ్ నేపథ్యంలో విచారణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణతో అసలు ఏం జరిగిందనే అంశం వెలుగులోకి రావచ్చునని అంచనా వేస్తున్నారు.