ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో అనూహ్యంగా వివాదాస్పదం అవుతున్న అంశాల ఖాతాలో మరొకటి చేరింది.
ఈ నెల 18న శారదాపీఠం స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా 23దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలు రాజకీయ విమర్శలకు వేదికగా మారుతున్నాయి. దానిపై ప్రధాన ప్రతిపక్షం భగ్గుమంటోంది.
సొంత కానుకలు ఇచ్చుకో జగన్….
ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఆదేశాలు దేవాలయాల పట్ల, స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ సనాతన సంప్రదాయాలకు వ్యతిరేకమన్నారు. ఇప్పటికే శారదా పీఠంపై అనేక వివాదాస్పద కథనాలు వస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రస్తుత ఆదేశాలు మరింత వివాదాస్పదం చేశాయని తెలిపారు. ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. కాశీలో తనతో చేయించిన హోమాలకు, స్వామి పట్ల భక్తి ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలని… అంతే తప్ప ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం స్వామిభక్తి కాదని యనమల రామకృష్ణుడు హితవు పలికారు. సీఎం జగన్కు ప్రజల పట్ల భక్తి కన్నా తనతో హోమాలు చేయించిన స్వామి భక్తి శ్రుతిమించిందని విమర్శించారు.
జీయర్ స్వామీజీ ఎంట్రీ?
ఈ ఆదేశాలు జగన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. చిన జియ్యర్ స్వామికి, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, ఇతర స్వామీజీల పుట్టిన రోజులకు లేని ఆలయ మర్యాదలు స్వరూపానందకు ఇవ్వడం ఇతర స్వామీజిలను, పీఠాలను కించపర్చడమే అని అన్నారు. కాగా యనమల రెండు టార్గెట్లతో ఈ కామెంట్లు చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. ఓ వైపు జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టడం మరోవైపు మరో ఇద్దరు శక్తివంతమైన స్వామిజీల విషయంలో సీఎం జగన్ ఇంతే గౌరవ మర్యాదలు పాటించడం లేదనే భావనను ప్రధానంగా ప్రస్తావించేలా ప్రయత్నిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.