ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో కొత్త చర్చ జరుగుతోంది. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు లేదా పరిస్థితులే కారణమై అయి ఉండవచ్చు కానీ ఏపీలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి జగన్ను ఓ రేంజ్లో ఇరుకున పడేస్తున్నాయని అంటున్నారు.
తాజాగా ఏపీలో జరిగిన ఘటన సీఎం జగన్ను ఓ వర్గం కేంద్రంగా టార్గెట్ చేసేందుకు ఖచ్చితంగా అస్త్రంగా మారుతుందని చెప్తున్నారు.
గుంటూరులో కలకలం
గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలోని మసీద్ లో మౌజమ్ గా పనిచేస్తున్న హనీఫ్ ఆత్మహత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ముస్లింల ఖబరస్తాన్ (శ్మశానం)లో మట్టి తవ్వడాన్ని హనీఫ్ అడ్డుకున్నాడని, దీన్ని కొందరు వైసీపీ నేతలు తప్పుపట్టారనేది ప్రచారంలో ఉన్న అంశం. అయితే, ఈ ఘటన కలకలం రేపింది. సహజంగానే దీన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అస్త్రంగా మలుచుకుంది.
టీడీపీకి చాన్స్ దొరికేసిందిగా
టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి సయ్యద్ రఫీ మీడియాతో మాట్లాడుతూ, ఖబరస్తాన్ లో మట్టి తవ్వే హక్కు ఎవరికీ లేదని, అలా చేస్తే తాను చూస్తూ ఊరుకోలేనంటూ హనీఫ్, మట్టితవ్వుతున్నవారిని అడ్డుకుంటే, వారు ఆయనపై అమానుషంగా దాడిచేశారన్నారు. తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ మౌజమ్ హనీఫ్ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారన్నారు. ఆ వీడియోలో ఆయన అల్లా గృహాన్ని కాపాడటం తన బాధ్యతగా భావించే మట్టి తవ్వకం పనులను అడ్డుకున్నానని, దానికే కొందరు వ్యక్తులు అకారణంగా తనపై దాడిచేశారని చెప్పడం జరిగిందని రఫీ తెలిపారు. తనకు జరిగిన అవమానానికి మనస్తాపానికిగురై, ఆత్మహత్య చేసుకుంటు న్నట్లుగా హనీఫ్ ఆ వీడియోలో చెప్పడం జరిగిందన్నా రు. అధికారంలో ఉన్నాం కదా అన్నఅహంకారంతో శ్మశానాలను కూడా తవ్వుకుంటామనే విధంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారన్నారు. మతపెద్ద అయిన హనీఫ్ పట్ల కనీస గౌరవం కూడా చూపకుండా, అతనిపై దాడిచేయడం ఏంటని రఫీ మండిపడ్డారు. ముస్లింలకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా అన్న రఫీ, తప్పులను ప్రశ్నించేవారిపై వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం ఏంటని నిలదీశారు. వారికి ఆ విధంగా దాడి చేసే ధైర్యం ప్రభుత్వ చర్యల ద్వారానే వచ్చిందన్నారు.
అసలేం జరుగుతోంది?
రాజమండ్రి రూరల్ పరిధిలోని బొమ్మూరులో అబ్దుల్ సత్తార్ కుటుంబానికి అన్యాయం, సత్తార్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, తాజాగా వైసీపీ కార్యకర్తలు చర్యల కేంద్రంగా ముస్లిం పెద్ద ఆత్మహత్యయత్నం సహజంగానే జగన్ సర్కారును టార్గెట్ చేసేవని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఘటనల విషయంలో సీఎం జగన్ సీరియస్గా వ్యవహరించకపోతే…రాబోయే కాలంలో ఓ వర్గం చే విమర్శలు ఎదుర్కోవడం తప్పదని చెప్తున్నారు.