జనసేన పార్టీ అధ్యక్షుడు , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆయన మిత్రపక్షమైన బీజేపీకి లైట్ అయిపోయారా? పవన్ ఒకటి తలిస్తే… బీజేపీ మరొకటి తలుస్తోందా? అంటే అవుననే అంటున్నారు ప్రస్తుత పరిణామాలను విశ్లేషించిన వారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మధ్య పొత్తుపై భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో వివిధ వర్గాలు చేస్తున్న ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ – జనసేన మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. మరోవైపు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. అయితే, దీనినిపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
పవన్ పేరుతో ప్రచారం
జీహెచ్ఎంసీలో బీజేపీ జనసేన పొత్తు జరగనుందని ప్రచారం తెరమీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్తో బీజేపీ నేతలు భేటీ కానున్నట్లు ప్రచారం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ను కలిసే సమయంలో జీహెచ్ఎంసి ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై చర్చ జరగనుందని వైరల్ అయింది. అయితే, దీనిపై బీజేపీ వెంటనే క్లారిటీ ఇచ్చింది. అలాంటి సమావేశం ఏం జరగడం లేదని ప్రకటించింది.
బండి సంజయ్ క్లారిటీ
ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. జనసేనతో పొత్తులేదని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులను ఇప్పటికే ఫైనల్ చేశామని, నామినేషన్ వేసుకోవాలని వారికి సమాచారం కూడా ఇచ్చాం.. అందుకే ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదన్నారు. రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టె కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పిన బండి సంజయ్ గ్రేటర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే పవన్ కల్యాణ్ను కలుస్తానని తెలిపారు. బీజేపీ తరపున గ్రేటర్లో ప్రచారానికి పవన్ కల్యాణ్ను ఆహ్వానిస్తానని బండి సంజయ్ వెల్లడించారు.