ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ దశను మార్చే అంచనాలతో బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు ఇందుకోసం శ్రమిస్తున్నారు. ఓ వైపు పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు సాగుతూనే మరోవైపు విపక్షాలపై సైతం విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన ప్రతిపక్ష పార్టీలపై చేసిన కామెంట్లు ఆయన దూకుడును స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.
ఐయామ్ ది ఫైర్ …
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ వైఖరి అని సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తుందని ఆయన తెలిపారు. 7200 కోట్లు రూపాయలతో చంద్రబాబునాయుడు రాజధాని కట్టి ఉంటే దీక్ష చేసే పని వచ్చేది కాదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అమరావతి కోసం ఏం చేశాడో చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. ఆ డబ్బులన్నీ పూర్తిగా రాజధానికి ఖర్చు చేసి ఉంటే ఈపాటికి రాజధాని అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి ఉండేదని వీర్రాజు తెలిపారు.
టీడీపీకి చాన్స్ లేదు … మాకు మాత్రమే
రాష్ట్రానికి ఏమి కావాలో అది చేసే శ్రద్ద కేంద్రానికి ఉందని వీర్రాజు అన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్ర పెద్దలను కలవవచ్చునని పేర్కొన్న వీర్రాజు అదే రీతిలో జగన్ సైతం కలిశారని తెలిపారు. కేంద్రం పోలవరంపై శ్రద్ధ చూపడం లేదు అనేది అవాస్తవమని పేర్కొన్న వీర్రాజు ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా ఎండగట్టడానికి బీజేపీ ముందు ఉంటుందని వీర్రాజు తెలిపారు. టీడీపీ చాలా అవకతవకలు చేసింది కాబట్టే ప్రభుత్వంపై మాట్లాడే అవకాశం లేదని పేర్కొన్న సోము వీర్రాజు బీజేపీకి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు.
చికెన్ తిని నాలుక మందం అయింది….
సీపీఐ నారాయణను నాయకుడిగా తాము ఒప్పుకోవడం లేదని సోము వీర్రాజు అన్నారు. “సీపీఐ వాళ్ళు మాట్లాడితే మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక స్థిరమైన నిర్ణయం లేదు. సీపీఐ నారాయణకి చికెన్ తిని నాలుక మందమైంది. వెంకయ్య నాయడిని ప్రశ్నించాలని మాట్లాడే నారాయణను మేము నాయకుడిగా పరిగణించడం లేదు. ఎన్నికల కమిషన్ సిపిఐ పార్టీ గుర్తింపును రద్దు చేసింది . చైనాలో వర్షం పడితే ఏపీలో గొడుగులు పట్టుకునే రకాలు.“ అంటూ సెటైర్లు వేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?