దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ కొనసాగుతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కీలక పరిణామాలు తెరమీదకు వచ్చాయి . ఒకటి కోవిడ్ వ్యాక్సిన్ ధర మరొకటి వ్యాక్సిన్ నిల్వ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు.
ప్రధాని కీలక వ్యాఖ్యలు
దేశంలో కరోనా వ్యాక్సిన్ పరిస్థితిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన ఈ మీటింగ్లో సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, టెస్టింగ్స్కు సంబంధించిన అంశాలను సీఎంలను మోడీ అడిగి తెలుసుకున్నారు. అన్ని సైంటిఫిక్ స్టాండర్డ్స్లో సేఫ్గా ఉన్న కరోనా వ్యాక్సినే దేశంలో అందుబాటులోకి తీసుకొస్తామని మోడీ చెప్పారు. వ్యాక్సిన్ను నిల్వ ఉంచడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంపై రాష్ట్రాలు పని చేయడం ప్రారంభించాలని మోడీ సూచించారు.
‘దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుంది. దీన్ని చూసి కొందరు వైరస్ బలహీనంగా మారిందని పొరబడుతున్నారు. ఇలాంటి ఆలోచన అలసత్వానికి దారితీస్తుంది. వ్యాక్సిన్కు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ వచ్చేలోపు ప్రజలను సురక్షితంగా ఉంచడం కీలకం. కరోనా పాజిటివ్ రేటును 5 శాతంలోపే ఉండేలా చూసుకోవడం మన ముందున్న పెద్ద సవాల్. భారత్లోని వ్యాక్సిన్ తయారీదారులతో మేం కాంటాక్ట్లో ఉన్నాం. గ్లోబల్ రెగ్యులేటర్స్తోపాటు ఇతర కంపెనీలతోనూ మేం టచ్లో ఉన్నాం. ఎన్ని డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అలాగే వ్యాక్సిన్ ధర ఎంతనేది కూడా ఇంకా నిర్ణయించలేదు’ అని మోడీ పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా?
దేశ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ “కోవిషీల్డ్” తరఫున కీలక వార్త వెలుగులోకి వచ్చింది. జనవరి నుంచి ఫిబ్రవరి నాటికి 100 మిలియన్ల వ్యాక్సిన్లను సిద్ధం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఆధార్ పూనావాలా మీడియాకు తెలిపారు. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 40 మిలియన్ల డోస్ లను ప్రభుత్వానికి అందించినట్లు, అదే విధంగా జనవరి నెలకు 100 మిలియన్లు, జులై నాటికి 300 నుంచి 400 మిలియన్ల డోస్ లను ఉత్పత్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఎంఆర్పీ రూ.1000గా ఉండగా.. ప్రభుత్వం అమ్మే కరోనా వ్యాక్సిన్ ధర రూ.250 లేదా అంతకంటే తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి రానుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆధార్ పూనావాలా చెప్పారు.