తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. లక్ష్యం సాకారం అవడంలో భాగంగా అధికారులు శ్రమిస్తున్నారు.
హైదరాబాద్లో ఉన్న ప్రస్తుత సచివాలయం ప్రాంగణంలోనే కొత్త సచివాలయం నిర్మాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. నూతన సచివాలయ భవన నిర్మాణ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి పరిశీలించారు.
కొత్త సచివాలయం
2019, జూన్ 26వ తేదీన వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తంలో సమీకృత కొత్త సచివాలయం పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సచివాలయం నిర్మాణానికి షాపూర్జీ పాల్లొంజీ సంస్థ ఎంపిక అయింది. సమీకృత కొత్త సచివాలయానికి ఇప్పటికే ఔట్ లైన్ ముగ్గు పోసిన షాపూర్జీ పాల్లొంజీ నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది. పనుల ప్రారంభ సూచకంగా తెలంగాణ ప్రవేశద్వారం సమీపంలో ఈ మధ్యే నిర్మించిన కమాన్ వెనక కన్స్ర్టక్షన్ సైట్ ఈశాన్య భాగంలో నిర్మాణ సంస్థ గొయ్యి తవ్వింది. సచివాలయం నిర్మాణ పనులపై ఎర్రమంజిల్ ఆర్అండ్బీ కార్యాలయంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులు, వర్క్ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు సచివాలయం నిర్మాణ పనులు 12 నెలల్లో పూర్తి కావాలని సూచించారు. ఇందుకోసం మొత్తం భవనాన్ని ఆరుప్రాజెక్టులుగా విభజించి ఒక్కోప్రాజెక్టుకు ఒక్కో వర్కింగ్ బృందం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రాజెక్టుకు ఇద్దరు చొప్పున మొత్తం 12మంది జేఈలను, అదేవిధంగా ముగ్గురు డీఈలు, ఒక ఈఈ, ఒక ఎస్ఈతోపాటు ప్రత్యేకంగా మెకానికల్ పనుల కోసం.. ముగ్గురు జేఈలను, ఇద్దరు డీఈలను ఒక ఈఈని నియమించుకోవాలని సూచించారు.
కంపెనీ సైతం….
మరోవైపు సచివాలయ నిర్మాణ సంస్థ షాపూర్జీ నుంచి కూడా.. 12మంది ఫీల్డ్ ఇంజినీ ర్లు, ఆరుగురు ప్రాజెక్టు ఇంజినీర్లు ఒక ప్రాజెక్టు మేనేజర్ను నియమించాలని మంత్రి ఆదేశాలు వెలువరించారు. ఆర్కిటెక్ట్ వైపు నుంచి ఆరు సూపర్వైజింగ్ బృందాలు సైట్లో పనిచేసేలా చూడాలని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ తరఫున ఎస్ఈ, అర్కిటెక్ట్, షాపూర్జీ సంస్థకు చెందిన ముగ్గురు కలిసి, ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీగా ఏఏ పనులు పూర్తిచేయాలో.. 11 నెలలు లక్ష్యంగా పీఈఆర్టీ చార్ట్ను వెంటనే సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతివారం స్వయంగా పనులను పర్యవేక్షిస్తానని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనలకనుగుణంగా, తెలంగాణ ఖ్యాతిని చాటేలా సచివాలయ భవనం నిర్మా ణం ఉండాలని వెల్లడించారు.