ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వివిధ రకాల సన్నాహాలు జరుగుతుండగా మరోవైపు టీకా అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు సైతం తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి కూడా.
కరోనా వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రానికి చేరిన రెండో రోజుల్లోపే పంపిణీ ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. మూడు కోట్ల డోసుల నిల్వకు సరిపడా ప్రత్యేక కోల్డ్ చైన్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.
లాక్ డౌన్ పెడితే ఏం చేయాలంటే…
కరోనా మహమ్మారి వ్యాప్తిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రం మార్గదర్శకాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు సరిగ్గా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితులు తెచ్చుకుంటారా అని పిటిషనర్ ఆవేదన చెందుతున్నారని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్రంతో రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి విధించాలంటే ఆ నిర్ణయంపై ప్రభుత్వం ముందుగానే ప్రకటన చేయాలనీ, ప్రజలు దానికి అనుగుణంగా సిద్ధమౌతారని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రతి రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆరోగ్యం, రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మరోవైపు కరోనా మహమ్మారి తీవ్రత తగ్గినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా వ్యాక్సిన్ ఇచ్చేది ఆమెకే
ఇదిలాఉండగా తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్య సిబ్బందికి తొలి విడుతలోనే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా తొలి టీకా ఎవరికి ఇవ్వాలన్న విషయమై స్పష్టత వచ్చింది. గాంధీ ఆస్పత్రి నర్సుకు టీకా ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా వ్యాక్సిన్ను పదహారేళ్ల లోపు వారిపై ఇంకా పరీక్షించనందున వారికి కొవిడ్ టీకా వేయబోమని వైద్య నిపుణులు చెప్తున్నారు.