న్యూఢిల్లీ: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు 2014 మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు.
మరోవైపు ఈ ఎన్ కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కాగా, దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను చటాన్పల్లి బ్రిడ్జి వద్ద పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున నిందితులు దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు చనిపోయారు. ఘటన జరిగిన అనంతరం దిశకు న్యాయం కలిగిందని సర్వాత్ర హర్షం వ్యక్తమయింది. నిందితుల మృతదేహాలు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. దీంతో అక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.