(అమరావతి నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాల సేకరణ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కార్యాలయంలో వివిధ రాజకీయ పక్షాల నేతల నుండి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నవంబర్ మొదటి వారంలో హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం..వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాల సేకరణ చేపట్టింది. ఇప్పటికే అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ 19 రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. అధికార వైసీపీ మాత్రం ఈ సమావేశానికి హజరుకావడం లేదని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అభిప్రాయాలను తెలుసుకోకుండా ఎన్నికల సంఘం అభిప్రాయాలను తెలియజేయాలంటూ పార్టీలను సమావేశాలకు పిలవడంతోనే ఎస్ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని అర్థమవుతోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలన్న సుప్రీం కోర్టు తీర్పునకు బిన్నంగా రమేష్ కుమార్ ముందుకు వెళ్లడాన్ని రాంబాబు ఖండించారు. కాగా ఉదయం బీజేపీ, బీఎస్పి, సీపిఎం, టీడీపీ నేతలు వేరువేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసి తమ పార్టీ అభిప్రాయాలను వెల్లడించారు.
ఏస్ఈసీకి అభిప్రాయాలను వెల్లడించిన తరువాత ఆ పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. బీజెపి నేత సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో జరిగిన ఏకగ్రీవాలన్న రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరినట్లు చెప్పారు. బీఎస్పి నేత బచ్చలకూర పుష్పరాజ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదటి నుండి నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. కరోనా ఉదృతి నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర పోలీసుల బలగాల భద్రత మద్య ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీపీఎం నేత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంతో పోలిస్తే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయనీ, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల సంఘం చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎకగ్రీవాలు రద్దు చేసి మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్ర బలగా రక్షణలో ఎన్నికల జరపాలని కోరినట్లు తెలిపారు. అదే విధంగా ఎన్నికలలో జరిగిన అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేన్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి మస్తాన్ వలీ ఇతర పార్టీల నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తమ పార్టీ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను నామినేషన్ ల ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల కమిషనర్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.