ఏపీలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఓ వైపు వరదల బీభత్సం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండగా మరోవైపు ఇంకో సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అదే ఏపీలో కరోనా విజృంభణ. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ముఖ్య నేతలు, కీలక పదవుల్లో ఉన్న నాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 7.67 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వారికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. వారిద్దరే, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
దేవాదాయ మంత్రి విషయంలో….
గత నెల కరోనావైరస్ బారిన పడిన కోలుకున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోమారు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. జ్వరంతో బాధపడుతుండటమే కాకుండా బాగా నీరసంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాలతో రోడ్డుమార్గం అనుకూలంగా లేకపోవడంతో.. విజయవాడ నుంచి హైదరాబాద్కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను హెలీకాప్టర్లో తరలించారు. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. గతంలో సైతం పలువురు నేతలకు హైదరాబాద్లోనే మెరుగైన వైద్యం అందించిన సంగతి తెలిసిందే.
జగన్ సొంత బాబాయికి సైతం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కూడా కరోనా సోకింది.. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా.. ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ముగిసి.. క్రమంగా అన్లాక్లోకి అడుగు పెడుతున్న సమయంలో.. ఆలయాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దీంతో.. కళియుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం కూడా తెరుచుకుంది. అయితే, ఆలయం తెరిచినప్పట్టి నుంచి కరోనా కేసులు కలవరపెడుతూనే ఉన్నాయి.. పలువురు అధికారులు, జీయర్లు, పూజారాలు ఇలా పెద్ద సంఖ్యలోనే కరోనా బారిన పడ్డారు. టీడీపీ చైర్మన్ సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఏపీలో ఏ మాత్రం తగ్గడం లేదు
ఇదిలా ఉండగా, ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 4,038 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 771503కి చేరింది. ఇందులో 40047 కేసులు యాక్టివ్ గా ఉంటే, 725099 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 38 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6357కి చేరింది.
జిల్లాల వారీ లెక్కలవే….
ఏపీలో కరోనా విషంలో జిల్లాల వారీగా తీసుకుంటే, పశ్చిమ గోదావరిలో 686 కేసులు, అనంతపురంలో 232, చిత్తూరులో 489, తూర్పుగోదావరి జిల్లాలో 548, గుంటూరులో 390, కడపలో 281, కృష్ణాలో 421, కర్నూలులో 103, నెల్లూరులో 178, ప్రకాశంలో 299, శ్రీకాకుళంలో 119, విశాఖపట్నంలో 196, విజయనగరంలో 96 కేసులు నమోదయ్యాయి.