దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తుండడంతో జనాలు మరింత ఆందోళనలకు గురవుతున్నారు. వారిలో కరోనా భయం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలు కరోనా రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన వారితోపాటు కరోనా రాని వారు కూడా తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. అందుకు గాను నిమ్మపండ్లు, గుడ్లను తెగ తింటున్నారు.
నిమ్మపండ్లలో విటమిన్ సి ఉంటుందని అందరికీ తెలిసిందే. అలాగే కరోనా బారిన పడిన వారు నిత్యం కోడిగుడ్ల డైట్తో ఆ వ్యాధి నుంచి బయట పడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో ఈ రెండు వస్తువులకు గిరాకీ ఎక్కువగా పెరిగింది. హైదరాబాద్లో వీటి వాడకం మరీ ఎక్కువగా ఉంది. నగరంలో నిత్యం సుమారుగా 1 కోటి వరకు కోడిగుడ్లు అమ్ముడవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే నిమ్మపండ్లు, కోడిగుడ్ల వాడకం పెరిగినా.. వాటి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. అవి పెరగడం లేదు.
సాధారణంగా నిమ్మపండ్లను వేసవిలోనూ.. శీతాకాలంలో గుడ్లను ఎక్కువగా వాడుతారు. కానీ ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ఈ రెండింటికీ గిరాకీ పెరిగింది. కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో అది రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుందామని చెప్పి చాలా మంది తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. వైద్యులు విటమిన్ సిని ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్న నేపథ్యంలో నిమ్మపండ్లకు ప్రస్తుతం గిరాకీ బాగా పెరిగింది.
ఇక కోడిగుడ్లలో ఉండే ప్రోటీన్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. అలాగే కోవిడ్ నుంచి బయట పడ్డ అనేక మంది కోడిగుడ్లను నిత్యం తమ డైట్లో తీసుకున్నామని చెబుతున్నారు. దీంతో కోడిగుడ్ల వినియోగం పెరిగింది. గత నెల రోజులుగా ఈ రెండు వస్తువులను జనాలు ఎక్కువగా వాడుతున్నారు. నిత్యం నిమ్మపండు రసం తాగడం, లేదా ఆ రసంతో పలు వంటలు చేసుకుని తినడం, ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడం చేస్తున్నారు.
కాగా ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా గుడ్ల వినియోగం బాగా పెరిగిందని చెప్పారు. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. నిత్యం రాష్ట్రంలో దాదాపుగా 3.2 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతాయి. దాదాపుగా 80 శాతం వరకు కోళ్ల ఫాంలు హైదరాబాద్ నగర శివార్లలోనే ఉన్నాయి. ఈ క్రమంలో పౌల్ట్రీ ఫాంలు చికెన్, కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచాయి. పెరుగుతున్న డిమాండ్కు తగినట్లుగా వాటిని ఉత్పత్తి చేసేందుకు పౌల్ట్రీ ఫాంలు సిద్ధమవుతున్నాయి.
అయితే చికెన్కు ప్రస్తుతం అంతగా డిమాండ్ లేకపోయినప్పటికీ కోడిగుడ్లకు డిమాండ్ ఉండడంతో పౌల్ట్రీ ఫాంలు ఆ దిశగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఇక హోల్ సేల్ మార్కెట్లో ఒక్క కోడిగుడ్డు ధర రూ.3.60 ఉండగా, రిటెయిల్ మార్కెట్లో రూ.4.50కు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఒక సంచి నిమ్మపండ్లను రూ.600 నుంచి రూ.800కు అమ్మారు. కానీ నిమ్మపండ్ల రేటు ప్రస్తుతం బాగా తగ్గింది. ఒక సంచి నిమ్మపండ్లను రూ.250 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో సంచిలో దాదాపుగా 300 వరకు నిమ్మపండ్లు ఉంటాయి.