Rajanna sircilla : ఈ మధ్యకాలంలో అడవిలో ఉన్నటువంటి క్రూర జంతువులు సమీప గ్రామాలలో సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రూర మృగాలు గ్రామాలలో ప్రవేశించడమే కాకుండా ఎన్నో మూగజీవాలను చంపుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగిన అటవీ అధికారులు మాత్రం అప్రమత్తం కాలేదు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లాలోని ఓ గ్రామంలో ఓ వింత మృగం బావిలో కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలో గత కొద్ది రోజులుగా క్రూర మృగాల బెడద ఎక్కువైపోయింది. వారం రోజులుగా ఈ ప్రాంతాలలో చిరుత సంచరిస్తూ అనేక మూగజీవాల పై దాడి చేయడంతో స్థానికంగా ప్రజలు ఎంతో భయాందోళనల చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిరుత దాడిలో మూడు లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. ఈ క్రమంలోనే గత రాత్రి వల్లంపట్లలో ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు వ్యవసాయ బావిలో ఓ క్రూరమృగం పడింది. దీనిని చూసిన స్థానికులు ఇది నక్క జాతికి చెందినదని, ఇది హైనా అని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇన్ని రోజులుగా తమ ప్రాంతాలలో సంచరిస్తూ అందరిని భయాందోళనలకు గురి చేసిన జంతువు ఈ విధంగా బావిలో కనిపించడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. తమ మూగ జంతువులను చంపి తింటున్నటువంటి క్రూరమృగం ఈ విధంగా వ్యవసాయ బావిలో ఇరుక్కుపోవడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రూర జంతువు ఏంటనేది అటవీ అధికారులు వస్తే తప్ప స్పష్టంగా తెలియదని స్థానిక ప్రజలు తెలియజేశారు. అయితే బావిలో పడినటువంటి క్రూరమృగం గురించి అటవీ అధికారులకు సమాచారం తెలియజేసినట్లు స్థానిక ప్రజలు తెలియజేశారు.