Chandrababu: రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు ,గొట్టిపాటి రవికుమార్ నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.వారు ఏ ఉద్దేశ్యంతో సీఎం జగన్ కి లేఖ రాశారోగాని అది చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకునే పరిస్థితి తలెత్తింది. తమ లేఖలో వారు పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వద్ద తెలంగాణ, సీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే మా పరిస్థితేంటని ముఖ్యమంత్రిని నిలదీశారు. గుంటూరు ఛానల్ ని దగ్గుబాడు వరకు పొడిగించి పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంపు విషయంలో పునరాలోచించాలి’ అని లేఖలో ముఖ్యమంత్రిని ముగ్గురు ఎమ్మెల్యేలు కోరారు.
ఆ లేఖతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు!
ఈ లేఖను బట్టి తమ జిల్లా గురించి ముగ్గురు ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారనుకోవాలి.కానీ వారి లేఖ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు కోస్తాంధ్రకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం పట్ల సీమ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబు రాయలసీమకు చెందిన నాయకుడే అయినప్పటికీ ఆయన ఏనాడూ ఈ ప్రాంత ప్రజల సాగు,తాగునీటి అవసరాలను ఆయన తీర్చలేదన్న అభిప్రాయం అక్కడివారిలో ఆల్రెడీ ఉంది. అలాంటిది ఇప్పుడు రాయలసీమకు మేలు చేసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించేందుకు చంద్రబాబు సరికొత్త ఎత్తులు వేశారని వారు మండిపడుతున్నారు.చంద్రబాబు రాయలసీమకు నీళ్లు తీసుకురాకపోగా జగన్ చేస్తున్న మంచి పనిని అడ్డుకోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి పాల్పడుతోందన్న తెలంగాణ వాదనకు బలం చేకూర్చేలా ప్రకాశం జిల్లాలోని తన పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబే ఈ లేఖ రాయించారని కూడా కొందరు ఆరోపిస్తున్నారు.దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో టిడిపి అధినేత ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అసలు ముఖ్యమంత్రికి నేరుగా ఎందుకు లేఖ రాశారని ఆయన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల పై ఫైర్ అవుతున్నారని మరో సమాచారం.సంక్షోభాన్ని తాను సవాల్ గా తీసుకుంటానని తరచూ చెప్పే చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.