BJP: ‘లింగోజిగూడ’ ఘటనపై బీజేపీ త్రీ మెన్ కమిటీ విచారణ కొనసాగుతోంది. ఈ డివిజన్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం అంటూ ఇటీవల కొందరు బీజేపీ నేతలు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను కలవడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. దీంతో పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించేందుకు, నిజాలు నిగ్గు తేల్చేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోమవారం ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. కేటీఆర్ ను కలిసిన బీజేపీ నాయకుల్లో ఏడుగురు మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీసులో త్రీ మెన్ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు.
ఏకగ్రీవం కోసమే అలా చేశాం!
లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే కేటీఆర్ ను కలిశామని, ఇది ఇంత రాద్ధాంతానికి దారితీస్తుందని ఊహించలేకపోయామని వారు కమిటీ ముందు చెప్పినట్లు తెలిసింది. ప్రగతి భవన్ కు వెళ్తున్న విషయం కారులో కూర్చునే వరకు తెలియదని, కేటీఆర్ను కలవడం తప్పేనని వారు కమిటీ ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. బుధవారం బీజేపీ మాజీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ పేరాల శేఖర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ల వివరణ తీసుకున్న అనంతరం త్రీ మెన్ కమిటీ రాష్ట్ర పార్టీకి రిపోర్టు ఇవ్వనుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడి పరిధిలో ఉన్న వారిపై బండి సంజయ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని, కొందరు సీనియర్ నేతల విషయంలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో చర్చించి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
అగ్రనేతలకుతెలియకుండా వ్యవహారం నడిపారా?
లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం బీజేపీ నేతలు కొందరు కేటీఆర్ ను కలవడానికి దారి తీసిన పరిస్థితులపై వాస్తవాలను తెలుసుకునేందుకు పార్టీ కమిటీని ఏర్పాటు చేసిందని బండి సంజయ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో బీజేపీ మరోసారి విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పోటీ చేయడానికి మేము సిద్ధమైతే, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుకు గాని సమాచారం ఇవ్వకుండా కొందరు నేతలు కేటీఆర్ ను కలవడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.ఇది పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. అందుకే ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కోసం త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు.
ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుండగా కొందరు కమలనాథులు కేటీఆర్ ని కలిసి ఉప ఎన్నిక అవసరం లేకుండా ఏకగ్రీవానికి సహకరించాలని కోరడం, అందుకాయన అంగీకరించడం తెలిసిందే.ఈ సందర్భంగా కెటిఆర్ వారితో గ్రూప్ ఫొటో దిగడం,ఈ కారణంగా బీజేపీ అప్రతిష్ట పాలు కావడం జరిగింది.దీన్ని పార్టీ అధిష్టానవర్గం సీరియస్ గా తీసుకుంది.ఏదేమైనా ఈ వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.