ఓ పక్క దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పలు జాగ్రత్త చర్యలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిల్లా వెల్లడించారు.
కరోనా నేపథ్యంలో ఉదయం నాలుగు గంటల పాటు ఒక సభ, సాయంత్రం నాలుగు గంటల పాటు మరో సభ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. కరోనా లాక్ డౌన్ తరువాత నిర్వహిస్తున్న తొలి సమావేశాలు కావడంతో ముందస్తు చర్యలు అన్నీ చేపట్టనున్నారు. భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఉభయ సభల్లోనూ సభ్యుల సీట్లను కేటాయించనున్నారు.
లోక్ సభ, రాజ్య సభలో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు హజరయ్యే 72 గంటల ముందు పార్లమెంట్ సభ్యులు, సిబ్బంది, మీడియాకు కరోనా టెస్ట్ లు నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణపై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసిఎంఆర్, ఎయిమ్స్, డిఆర్ డిఒ ప్రతినిధులు, లోక్ సభ, రాజ్య సభ అధికారులతో స్పీకర్ ఒం బిల్లా కసరత్తు పూర్తి చేశారు. ఉభయ సభ హౌజ్ ల్లోని చాంబర్స్, గ్యాలరీలను బౌతిక దూరం పాటిస్తూ సిట్టింగ్ కోసం వాడనున్నారు. హౌస్ లోని చాంబర్స్ లో నాలుగు పెద్ద స్క్రీన్ లు, ఆరు చిన్న స్క్రీన్ లను గ్యాలరీలో ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజ్య సభలో 60 మంది సభ్యులు చాంబర్ లో, మరో 51 మంది గ్యాలరీలో, మిగిలిన 132 మంది సభ్యులు లోక్ సభలో కూర్చునే లా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే తరహాలో లోక్ సభలోనూ సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో 1952 తరువాత సీటింగ్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. మరో పక్క జెర్మ్స, వైరస్ లను సంహరించడానికి ఎయిర్ కండీషన్స్ యూనిట్స్ లో అల్ట్రావయోలెట్ జెర్మిడికల్ ఇర్రేడియేషన్ సిస్టమ్ ను బిగించనున్నారు.