ఆదాయం సమకూర్చడం ఎలా?? గ్రామీణ ప్రాంతాల్లోకి కరోనా వెళ్లకుండా చూడడం ఎలా…? వలస కార్మికులకు ఆర్ధికంగా ఆదుకోవడం ఎలా..? మే 17 తర్వాత ఏం చేద్దాం…?? ఇదే అంశాలపై ప్రధానమంత్రి మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్సు లో.మాట్లాడుతున్నారు. కరోనా నేపద్యంలో లాక్ డౌన్ 4వ దశ కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కీలక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కువమంది ముఖ్యమంత్రులు కొన్ని వెసులుబాట్లుతో కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆర్థికంగా ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ జూన్ మొదటి వారం వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాని కీలక సూచనలు…!
ఈ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అసలు కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని సూచించారు. ఆయన సూచన కీలకమే… ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోనే 90 శాతం కేసులు ఉన్నాయి. దగ్గర దగ్గర నివసించే గ్రామీణ ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది అంటే కట్టడి చేయడం చాలా కష్టం. అందుకే మోదీ కూడా ముఖ్యమంత్రుల వద్ద తన అంతర్గత భయాన్ని సూచనల రూపంలో వెల్లడించారు. అదే సందర్భంగా వలస కార్మికులు, ప్రజా ప్రయాణాల సందర్భంగానూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రులు ఏమన్నారంటే…!
ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ దారిలో పెట్టడం.., ప్రజా రవాణా, వలస కార్మికులు, ఉపాధి కల్పన, రెడ్ జోన్లలో పరిస్థితి అదుపు తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. వీటిపై ముఖ్యమంత్రులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ అంశంలోనూ కాస్త చర్చ జరిగింది. మొదటి దశలో 1.70 లక్షల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరింత ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని ముఖ్యమంత్రులు కోరారు. ముఖ్యంగా బీహార్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా, అస్సాం, మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు ఆర్థిక ప్యాకేజీ పై మాట్లాడినట్టు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని బాగా పని చేస్తున్నారు కితాబిచ్చారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రస్తుతం అందరం బాగా పని చేస్తున్నామని, రాజకీయాలు పక్కనబెట్టి కరోనా కట్టడికి చేద్దామని సూచించారు. ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఇది ముగిసిన తర్వాత రెండు రోజుల్లో ఆర్ధిక ప్యాకేజి ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.