ఢిల్లీ: 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో మూడో దశ పోలింగ్ ముగిసింది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింసాఖాండ జరిగింది.
ముర్షిదాబాద్లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్-టిఎంసి కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఓటేయడానికి నిలుచున్న ఓటరు ఒకరు హత్య గావించబడ్డాడు. ఇదే ముర్షిదాబాద్లో మరో పోలింగ్ కేంద్రం వద్ద ఒక వ్యక్తి బాంబు విసిరాడు. మరికొన్నిచోట్ల బిజెపి-టిఎంసి కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఒక పోలింగ్ బూత్ వద్ద బిజెపి కార్యకర్తలు ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడ్డారు. సమాజ్వాదీ పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు చెబుతున్నాడని వాళ్ళు ఆరోపించారు.
ఉదయం ఏడు గంటలకు మూడో దశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 117 పార్లమెంటు నియోజకవర్గాల్లో 1,640 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఒడిశా, గుజరాత్, గోవాలో పలు అసెంబ్లి స్థానాలకు కూడా ఎన్నిక జరిగింది. గుజరాత్లో 26 లోక్సభ, నాలుగు అసెంబ్లి స్థానాలకు ,ఒడిశాలో ఆరు లోక్సభ, 42 అసెంబ్లి స్థానాలకు, గోవాలో రెండు లోక్సభ, మూడు అసెంబ్లి స్థానాలకు పోలింగ్ జరిగింది.
కేరళలో 20, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, యూపీలో 10, ఛత్తీస్గఢ్లో ఏడు, బీహార్లో ఐదు, బెంగాల్లో ఐదు, అసోంలో నాలుగు లోక్సభ స్థానాలకు, జమ్మూకాశ్మీర్, దాద్రానగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, త్రిపురలో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్ అనంతనాగ్లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగింది.
మరోవైపు మూడో విడతలో సాయంత్రం ఐదు గంటల వరకు 61 31 శాతం పోలింగ్ నమోదయ్యింది.
ఐదు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం:
- అస్సాం – 74.05
- బీహార్ – 54.95
- ఛత్తీస్గఢ్ – 64.03
- దాద్రానగర్ హవేలీ – 71.43
- డామన్ డయ్యూ – 65.34
- గోవా – 70.96
- గుజరాత్ – 58.81
- జమ్మూ కశ్మీర్ – 12.46
- కర్ణాటక – 60.87
- కేరళ – 68.82
- మహారాష్ట్ర – 55.05
- ఒడిశా – 57.84
- త్రిపుర – 71.13
- ఉత్తరప్రదేశ్ – 56.36
- పశ్చిమబెంగాల్ – 78.94
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?