ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు ప్రతి పేద వాడికి వైద్యం అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో వైద్యరంగంలో సమూల మార్పులను తీసుకువచ్చారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్పు చేశారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయలను కల్పించి కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో విద్య వైద్య రంగాల్లో ఏపి సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలను లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ ప్రశంసించారు.
విశాఖలో అందరికీ ఆరోగ్యం పుస్తకావిస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న జేపి మాట్లాడుతూ విద్య , వైద్య రంగంలో ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను అభినందిస్తున్నానని చెప్పారు. విద్య, వైద్య రంగంలో నాడు – నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్ధుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తొందని అన్నారు. ఈ అంశాల్లో సీఎం వైఎస్ జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యరంగంలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకపోతే పట్టణాలకు వెల్లాల్సి ఉంటుందని చెప్పారు. పేద వర్గాలకు వైద్య సేవలు అందించే ఆరోగ్య శ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపియేనని పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికి ఒక మార్గాన్ని చూపారని అన్నారు జేపి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ డయోగ్నొస్టిక్ ను బాగా అమలు చేయడం అభినందనీయమని అన్నారు. ఓ పక్క రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలనా విధానాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో మేధావిగా గుర్తింపు పొందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ .. జగన్మోహనరెడ్డి విద్యా, వైద్య రంగంలో తీసుకువచ్చిన సంస్కరణను అభినందించడం విశేషం.