హైదరాబాద్: లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ(జేపీ) కారుకు ప్రమాదం జరిగింది. ఆదివారం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద జేపీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి జేపీ తన కారులో వెళుతున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో కారు ఆపారు. అయితే, హఠాత్తుగా వెనుక వైపు నుంచి వచ్చిన ఆటో, జేపీ కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం ధ్వంసమైంది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటనతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద దాదాపుగా అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో జేపీతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మహిళలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.