Lokayukta: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది కరోనా చికిత్సకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందే.వైద్యం మూలికలు మరికొన్ని ఇతర ముడి పదార్థాలతో ఆనందయ్య ఈ మందును తయారుచేసి కరోనా నిరోధానికి ,ఒకవేళ వస్తే ఆ వ్యాధి తగ్గడానికి ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు.
ఇప్పటికే ఇరవై వేల మందికి పైగా ఆ మందును వాడారు. అందరూ సురక్షితంగా ఉన్నారు.ఆ మందు బాగా పనిచేస్తోందని, కరోనా తగ్గుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో అన్ని దారులు కృష్ణపట్నం వైపు దారితీశాయి. ఆ గ్రామంలో కిలోమీటర్ల పొడవున్న క్యూలు సైతం ఏర్పడ్డాయి.మందు దొరికితే చాలు బతికినట్టే అన్న భావన ప్రజల్లో బలంగా వ్యాపించింది.అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.ఈ మందు పై విచారణ అంటూ హడావుడి చేసింది.అధికార యంత్రాంగం ఎందుకని అకస్మాత్తుగా ఈ మందు పై స్పందించింది అన్న అనుమానాలు తలెత్తాయి.ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఈ రకమైన చర్యలు తీసుకుందన్న వార్తలు వచ్చాయి.లోకాయుక్త ఆదేశాల మేరకే జిల్లా కలెక్టర్ ఆరుగురు సభ్యులతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించారని ,మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయించారని మీడియాలో ,సోషల్ మీడియాలో రచ్చ అయింది .లోకాయుక్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి.
లోకాయుక్త స్పందన ఏమిటంటే!
ఈ నేపధ్యంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్త శుక్రవారం కృష్ణపట్నం ముందు పై స్పందించారు .చీరాలకు చెందిన న్యాయవాది జర్నలిస్ట్ ,ఆసాది సతీష్ రెడ్డి కృష్ణపట్నం మందు విషయంలో లోకాయుక్తకు ఒక లేఖ రాసి ఈమెయిల్లో పంపగా శుక్రవారం లోకాయుక్త రిజిస్ట్రార్ వివరణ ఇచ్చారు.ఆ మందు పంపిణీని నిలిపివేయమని లోకాయుక్త ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని , ఎలాంటి సుమోటో కేసు కూడా నమోదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మందు పంపిణీ సమయంలో ఆ గ్రామంలో కరోనా నిబంధనలు అమలయ్యేట్లు చూడమని మాత్రమే లోకాయుక్త కార్యాలయం నెల్లూరు జిల్లా కలెక్టర్ కు సూచించిందన్నారు.ప్రజలకు ఉపయోగపడే దేనిని కూడా లోకాయుక్త అడ్డుకోరని రిజిస్ట్రార్ వివరించారు.దీంతో తనపై పడ్డ మచ్చను లోకాయుక్త మాపుకున్నట్లయి౦ది.