ఎక్కడపోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారో లేక ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి “రాజకీయ అవసరం” మాట్లాడిస్తుందో తెలియదు కానీ… టీడీపీ నేతలకు దళితులు తెగ గుర్తుకు వచ్చేస్తున్నారు.. వారిపై తెగ ప్రేమ కురిపించేస్తున్నారు! ఎన్టీఆర్ ప్రజా పునాధులపై పార్టీని స్థాపిస్తే, దానికి కుల గోడలు నిర్మించుకున్నారన్న విమర్శను బాబు సంపాదించుకున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకంటే అధికంగా దళితులు బాబును దూరం పెట్టారనే విశ్లేషణలు బలంగా సాగాయి! దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!
దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు మాట్లాడితే… వారి గురించి అసహ్యంగా మాట్లాడారు బాబు కేబినెట్ లోని మంత్రి ఆదినారాయణరెడ్డి. అనంతరం విద్యార్థులను కూడా కులంపేరు చెప్పి దూషించేపనికి ఒడిగట్టారు నాటి ఏపీఎస్ ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య. ఇలా అన్ని రకాలుగా దళితులను టీడీపీ దూరం చేసుకుంది. ఫలితం తాజా ఎన్నికల ఫలితాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. దాని ప్రభావమో ఏమో కానీ.. తాజాగా నారా లోకేష్ గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా దళితులపై ప్రేమను కురిపిస్తున్నారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్… ఆంధ్ర యూనివర్సిటీలో కుల వివక్ష దారుణం అని, దళిత ఆచార్యుడు డాక్టర్ పేటేటి ప్రేమానందంపై కులం పేరుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆయనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ గారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. దళితులకు జరుగుతున్నఅన్యాయాలపై ప్రశ్నించినందుకు మహాసేన రాజేష్ గారిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. మాస్కుల్లేవని అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని ఘోరంగా హింసించి బంధించారు. దళితులకు ఉపాధి కల్పించే లిడ్ క్యాప్ భూములు లాగేసుకున్నారు. దళితుల గొంతును నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న నిరంకుశ జగన్ ప్రజావ్యతిరేక పాలనపై తిరుగుబాటు తప్పదు అని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇవన్నీ చాలా బాగున్నాయి.. నారా లోకేష్ తన తండ్రిలా ఒక వర్గానికి వ్యతిరేకి కాదని, అన్ని వర్గాలను ఒకేలా చూసే విశాలమైన మనసున్న నాయకుడికి ఉండాల్సిన లక్షణాలున్న వ్యక్తి అని అనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది! కానీ అది ఎప్పుడంటే… “గతంలో నా తండ్రి, ఆయన క్యాబినెట్ లోని ఒక మంత్రి, నామినేటెడ్ పోస్టులో ఉన్న మరో నేత కూడా దళితులను అవమానపరిచేలా మాట్లాడారు.. వారి మనసులను గాయపరిచారు.. వారి మాటలను నేను ఖండిస్తున్నాను.. దళితులకు వీరంతా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను” అని లోకేష్ అన్నప్పుడు! అప్పటివరకూ ఈ కొంగ జపాన్ని జనాలు నమ్మరేమో!!