ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహం, చర్చ అవసరం లేదు.
అలాంటప్పుడు వైఎస్ జగన్ ఒకింత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే సున్నితమైన విషయాల్లో మరింత శ్రద్ధ వహించాలి. అయితే, అలా చేయకపోవడం వల్ల విపక్ష తెలుగుదేశం పార్టీకి దొరికిపోయారు. ఇంకేముంది టీడీపీ యువనేత నారా లోకేష్ ఆయన్ను ఓ రేంజ్లో ఆడుకున్నారు.
జగన్ చేసిన పనికి…
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో పర్యటించిన సంగతి తెలిసిందే. టీటీడీ పర్యటనలో రేణిగుంట ఎయిర్ పోర్టులో సీఎం జగన్ తో ఫోటో కోసం ఇద్దరు వ్యక్తులు మాస్క్ పెట్టుకుని వచ్చినపుడు మాస్క్ తీసేయాలని జగన్ చెప్పినట్లుగా ఉన్న వీడియోను లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో లక్షల్లో కరోనా కేసులు, వేల సంఖ్యలో ప్రజల చనిపోతుంటే.. జగన్ మూర్ఖత్వానికి మానవ రూపంగానే మిగిలిపోయారని మండిపడ్డారు. సీఎం జగన్ మాస్క్ పెట్టుకోరు, వేరే వాళ్ళు పెట్టుకుంటే ఊరుకోరు అంటూ ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. దళిత యువకుడు కిరణ్ ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపడం ఎందుకు? అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో కిరణ్ ని చంపింది మాస్క్ వేసుకోలేదనా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?అని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఎంపీ కూడా వచ్చేశారు మరి
మరోవైపు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఈ ఉదంతంపై స్పందించారు. ముఖ్యమంత్రి తిరుమలలో మాస్క్ పెట్టుకోలేదు అని తప్పుపట్టారు. ముఖ్యమంత్రిని చూసి ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారని చురకలు అంటిచారు. ముఖ్యమంత్రి ఆదర్శవంతుడిగా ఉండాలి కానీ, వేలెత్తి చూపే వాడిగా ఉండొద్దని ఎద్దేవా చేశారు. ఇక డిక్లరేషన్ వివాదంపై కూడా స్పందిస్తూ డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ తిరుమల ఆలయానికి వెళ్లడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఆచారాన్ని గౌరవించమని కోరినప్పటికీ ఏపీ సీఎం ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. కాగా, ఇటు తెలుగుదేశం పార్టీ, అటు సొంత ఎంపీ చేసిన విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతలు లేదా ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.