ఎట్టకేలకు కొత్త ప్రెసిడెంట్ ఎన్నికకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. జూన్ నాటికి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ సెషన్ ను నిర్వహించాలని నిర్ణయించింది.
పార్టీ చీఫ్ సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ శుక్రవారం వర్చువల్ గా జరిగింది. దాదాపు మూడున్నర గంటల సమావేశం తర్వాత కాంగ్రెస్ లీడర్లు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల(పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని మీటింగ్ లో నిర్ణయించామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఏదేమైనప్పటికీ జూన్ నాటికి కొత్త ప్రెసిడెంట్ ఎన్నికను పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని తెలిపారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బట్టి, షెడ్యూల్ లో కొంత మేరకు మార్పులు ఉండొచ్చని పేర్కొన్నారు. ‘‘మే చివరలో ప్రెసిడెంట్ ఎన్నిక నిర్వహించాలని ఎలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్లు నిర్వహించొద్దని సీడబ్ల్యూసీ మెంబర్లు సోనియాను కోరారు. జూన్ వరకు ప్రెసిడెంట్ ఎన్నికను పూర్తి చేయాలని, జూన్ చివరలో ఏఐసీసీ ప్లీనరీ సెషన్ ను నిర్వహించాలని విన్నవించారు” అని వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి మీటింగ్ లో ఎలాంటి గొడవ జరగలేదని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. షెడ్యూల్ ను కొంచెం ముందుకు పొడిగించాలని సీనియర్ లీడర్లు సూచించారని పేర్కొన్నారు.
ముందే ఎన్నికలు పెట్టాలని రెబెల్స్ డిమాండ్
మీటింగ్ లో ముందుగా సోనియాగాంధీ మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రతిపాదించిన ఆర్గనైజేషనల్ ఎలక్షన్ షెడ్యూల్ ను కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ప్రెసిడెంట్ ఎన్నిక, ఏఐసీసీ సెషన్ ను మే 29న నిర్వహించాలని సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రతిపాదించింది. ఈ సందర్భంగా లీడర్ల మధ్య గొడవ జరిగింది. పార్టీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రెబెల్ గా మారిన సీనియర్ లీడర్లు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, పి.చిదంబరం డిమాండ్ చేశారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే పార్టీ ఎలక్షన్లు నిర్వహించాలని… గాంధీ ఫ్యామిలీకి విధేయులైన అశోక్ గెహ్లాట్, అమరీందర్ సింగ్, ఏకే ఆంటోని, తారీఖ్ అన్వర్, ఉమెన్ చాందీ కోరారు. ‘‘ఎవరి ఎజెండా మేరకు మనం పని చేస్తున్నాం? మన పార్టీ మాదిరి బీజేపీ ఇంటర్నల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడదు. ముందు అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే ఆర్గనైజేషనల్ ఎలక్షన్లు” అని ఓ లీడర్ కామెంట్ చేశారు. ఇంటర్నల్ ఎన్నికల విషయాన్ని పార్టీ చీఫ్ సోనియాకు వదిలేసి, మోడీ సర్కార్ పై పోరాడే విషయంపై ఫోకస్ పెట్టాలని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే పార్టీ ఎలక్షన్లు పెట్టాలని నిర్ణయించారు. ఎన్నికల తేదీలపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని నేతలు ప్రకటించారు.