స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ లలో నేటి సాయంత్రం ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో భాగంగా తేనీటి విందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గానూ తెలంగాణ సీఎం తమిళి సై సౌందరరాజన్, ఇటు ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసిఆర్ లకు మధ్య బహిరంగ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గవర్నర్ తమిళిసై ఆహ్వానంపై రాజ్ భవన్ లో జరిగే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ హజరు అవుతారా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎంఓ నుండి ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ రాలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ వైఖరిపై పలు మార్లు గవర్నర్ తమిళిసై బాహాటంగానే విమర్శలు చేయడం, దానిపై మంత్రులు రియాక్ట్ అవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం జరిగే ‘ఎట్ హోమ్’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.
ఇక ఏపి విషయంలోనూ సరికొత్త పరిణామం చోటుచేసుకోబోతున్నదా అన్న చర్చ జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం ఏపి రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందింది. అయితే ఎట్ హోమ్ కార్యక్రమానికి హజరు కావాలంటూ ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తొంది. టీడీపీ విపక్షంలోకి వెళ్లిన తరువాత ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు హజరుకావడం ఇదే ప్రధమం. తొలి సారిగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఎట్ హోమ్ కార్యక్రమానికి హజరు అవుతుండటం, సీఎం వైఎస్ జగన్ తో ఒకే వేదిక పంచుకోబోతుండటం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశానికి ఏపి సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందగా, చంద్రబాబు మాత్రమే హజరైయ్యారు. సీఎం జగన్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టి ఆ మరుసటి రోజు జరిగిన నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి హజరైయ్యారు. అయితే ఆ రోజు వైఎస్ జగన్ కు వ్యక్తిగత కార్యక్రమాలు ఉండటం వల్ల వెళ్లలేదని సమాచారం. ఇప్పుడు రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ .. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానం పంపడం, ఆయన హజరు అవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ హజరు అవుతారా లేదా, ఒకే వేదిక పంచుకుంటారా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లలో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. మరి కొద్ది గంటలపై దీనిపై సస్పెన్స్ వీడనుంది.