తెలంగాణా, తమిళనాడుతో పాటుగా, వివిధ రాష్ట్రాలు, పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థతి ఏమిటి అని అందరూ ఎదురుచూస్తున్న వేళ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదోతేదీ నుంచే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పుడు ఈ విషయంపైనే జగన్ ట్విట్టర్ ఖాతా మెసేజ్ లతో నిండిపోతుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకు కుదించి నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పదోతరగతి విద్యార్థులు చాలామంది… ఫేస్ బుక్, ట్విట్టర్ లలో జగన్ అఫీషియల్ అకౌంట్ కి విపరీతమైన మెసేజ్ లు, ట్వీట్లు, కామెంట్లు పెడుతున్నారట. ఇదే క్రమంలో కొందరు విద్యార్థుల తల్లితండ్రులు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారని తెలుస్తుంది. కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితుల్లో తీసుకోవల్సిన అనేక జాగ్రత్తల్లో భాగంగా.. పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారంట.
జూలై పదవ తేది నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ప్రకటించడంతో కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని కొందరు కోరుతున్నారంట. ఇందులో భాగంగా తెలంగాణా, తమిళనాడు ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, వారికి గ్రేడ్లు ఎలా నిర్ణయించాలనే ఆలోచనని జగన్ దృష్టికి తీసుకెళ్తున్నారంట. మరి ఈ విషయాలపై జగన్ సర్కార్ పునరాలోచన చేస్తుందా లేక పరీక్షలు నిర్వహించి తీరుతుందా అనేది వేచి చూడాలి.