జగన్ మంత్రులు అందరిలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి మైనస్ మార్కులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపకు ఇంచార్జిమంత్రిగా కూడా ఉన్న ఆదిమూలపు సురేష్ కి సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు .
ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సురేష్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సురేష్ రాజకీయ ప్రస్థానం తీసుకుంటే.. ప్రముఖ విద్యాసంస్థల అధినేతగా ఆయన తండ్రికి ప్రకాశంజిల్లాలో పేరుంది. సురేష్ కూడా ఐఆర్ ఎస్ అధికారిగా పనిచేశారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే రెవెన్యూ శాఖలోనే పనిచేశారు.అయితే, 2009లో అప్పటి వైఎస్ హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సురేష్ ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి ఘన విజయం దక్కించుకున్నారు. అయితే, ఆయన గెలిచిన తర్వాత.. రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ మరణం, రాష్ట్ర విభజన ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్రాన్ని ఊపేశాయి.
ఈ క్రమంలో నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి పనినీ సురేష్ చేపట్టింది లేదు. దీంతో ఇక్కడ ఆయనకు ఫుల్ యాంటీ ఏర్పడింది.అప్పటికే ఎర్రగొండపాలెంలో 2009లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి సురేష్ చేతిలో ఓడిపోయిన పాలపర్తి డేవిడ్రాజు వైఎస్ఆర్సిపిలో చేరి అక్కడ సీటు ఖరారు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లో సురేష్ వైసీపీలో చేరి 2014 ఎన్నికలలో సంతనూతలపాడు సీటు దక్కించుకున్నారు. అక్కడి నుంచి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాకపోవడంతో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనినీ చేపట్టలేదు.
దీంతో ఇక్కడ కూడా వ్యతిరేకత ఏర్పడింది.ఇదే సమయంలో 2014లో ఎర్రగొండ పాలె౦ లో గెలిచిన డేవిడ్ రాజు మధ్యలో టీడీపీలోకి వెళ్లిపోయారు దీంతో మళ్లీ సురేష్ గత ఏడాది ఎన్నికల్లో ఎర్రగొండ పాలేనికి మారిపోయారు.వైసిపి గాలిలో ఘన విజయం సాధించారు.కాగా 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు గెలువగా నలుగురు టీడీపీలోకి మారిపోయారు.కేవలం సురేష్ ,మార్కాపురం లో గెలిచిన జంకే వెంకటరెడ్డి మాత్రం వైసీపీలో మిగిలారు.అనివార్య కారణాల వల్ల జంకే కి మళ్లీ టిక్కెట్ ఇవ్వలేకపోయారు.సురేష్ హ్యాట్రిక్ విజయం సాధించటంతో పాటు ఆయన వైసీపీ పట్ల చూపిన విధేయతకు జగన్ ముగ్ధుడయ్యాడు.కుల సమీకరణాలు కూడా కలిసి రావడంతో సురేషు కి జగన్ మంత్రి పదవిని ఇచ్చారు.కడప జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా కూడా వేశారు.
అయితే ఆయనకు మైనస్ మార్కులే పడుతున్నాయి. ఒకవైపు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ.. సొంత నియోజకవర్గంలో ఎక్కడా అందుబాటులో ఉండడంలేదు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉండడం, మరీముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉండడంతో ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలేనికి అతిథి ఎమ్మెల్యేగా మారారు.మంత్రిగా కూడా సురేష్ పనితీరు పట్ల ముఖ్యమంత్రి సంతృప్తిగా లేరంటున్నారు.మొత్తం మీద మంత్రి సురేష్ పరిస్థితి అంత కంఫర్ట్బుల్గా లేదని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు!