పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న సందర్భంలో ఆ వివాహం నచ్చని వధువు పెద్దలు పరువు కోసం కూతురు ప్రేమించిన వాడిని హత్య చేయించడం లేదా దాడి చేయించం, తల్లిదండ్రులే కుమార్తెను కిడ్నాప్ చేయడం అటు సినిమాల్లోనూ, ఇటు నిజ జీవితంలోనూ చూస్తూనే ఉన్నాము. ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి ఏపిలో జరిగింది. విషయంలోకి వెళితే..
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లికి చెందిన మోహన కృష్ణ, గుంటూరు జిల్లాకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ షుష్మ రెండు వారాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం సుష్మ తల్లిదండ్రులకు నచ్చలేదు. సుష్మ తల్లి గుంటూరు జిల్లాలో మాజీ సర్పంచ్ కాగా, తండ్రి రాజకీయ పార్టీ నాయకుడు. కుమార్తె ప్రేమ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు ఇటీవల మోహన కృష్ణ నివాసం ఉంటున్న ఇంటికి వచ్చి తిరిగి వచ్చేయాలని సంప్రదింపులు జరిపారు. సుష్మ అందుకు అంగీకరించకపోవడంతో వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రుల నుండి ఎటువంటి భయం లేదని అనుకుంటున్న తరుణంలో ఉదయం తిరిగి ఇంటిపైకి దాడికి దిగారు. కత్తులు, రాడ్లతో ఇంటిపై దాడి చేసి తలుపులు పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారు. ఆపై నవ వధువు సుష్మను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు.
ఈ ఘటనపై సుష్మ భర్త మోహన కృష్ణ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తలుపు పగులగొట్టి ఉండటం, ఇంట్లో వస్తువులు చింతరవందరగా పడి ఉండటం గమనించిన పోలీసులు.. ప్రేమ వివాహం నచ్చని సుష్మ తల్లిదండ్రులే బలవంతంగా తీసుకువెళ్లి ఉంటారని కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరుణంలోనే తల్లిదండ్రుల నుండి తప్పించుకున్న డాక్టర్ సుష్మ .. గుంటూరు నుండి ప్రైవేటు వాహనంలో తిరుపతి చేరుకుంది. భర్త మోహనకృష్ణతో కలిసి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని ఆశ్రయించి తమ కుటుంబ సభ్యుల నుండి కాపాడాలని వేడుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఇద్దరు మేజర్లు కావడంతో నూతన వధూవరులకు రక్షణ కల్పిస్తామని పోలీసులు తెలిపారు.
కేసిఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కి వాటి నుండి కొత్త తలనొప్పి