తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎంఎం క్రీమ్గా ప్రసిద్ధుడు. వీరి కుటుంబీకులు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళికి వరుసకు అన్న అవుతారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కీరవాణికి చిన్నాన్న. చిన్నప్పటి నుంచి సంగీతంపై మక్కువ ఎక్కువ. అయితే కెరీర్ ప్రారంభంలో కల్కి అనే సినిమాకు సంగీత దర్శకుడిగా చేశారు. ఆ సినిమా థియేటర్లలో విడుదలకు కూడా నోచుకోలేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తన టాలెంట్తో ఇండస్ట్రీలో రాణించారు. రామోజీరావు నిర్మించిన ‘మనసు మమత, పీపుల్స్ ఎన్ కౌంటర్, అమ్మ, అశ్విని’ తదితర సినిమాల్లో ఎంఎం కీరవాణి పని చేశారు. సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా ‘క్షణక్షణం’తోనే కీరవాణికి బ్రేక్ వచ్చింది. డైరెక్టర్ రాఘవేంద్రరావుతో కలిసి 27కుపైగా సినిమాలు చేశాడు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చే అన్ని సినిమాలకు ఆయన సంగీతం అందించారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ‘పద్మ’ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కేంద్రం 106 మంది పద్మ అవార్డులు ప్రకటించింది. 6 మందికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించింది. ఈ కోవలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించనుంది. ‘నాటు నాటు’ పాటతో కీరవాణి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాట ఉత్తమ గీతం విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచిన విషయం కూడా తెలిసిందే.
ఇటీవల అమెరికాలో నాటు నాటు పాటకు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ఆర్ఆర్ఆర్ టీమ్ అందుకున్నారు. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న వారికి ఆస్కార్ అవార్డు వరిస్తుంటాయి. త్వరలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ‘మనసు మమత’ సినిమాతో మూజిక్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన కీరవాణి.. ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన స్వరాన్ని సమకూర్చారు. వినసొంపైన బాణీలను వాయిస్తూ దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. కొన్ని వేల పాటలను కంపోజ్ చేసిన కీరవాణిని కేంద్రం పద్మశ్రీ అవార్డుతో గౌరవించడం చెప్పుకోదగ్గ విషయమే.
కీరవాణికి పద్మశ్రీ పురస్కారం రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ విషయంపై దర్శకధీరుడు రాజమౌళి కూడా స్పందించారు. ‘నిజానికి ఈ గుర్తింపు నా అన్నకు ఎప్పుడో రావాలి. కానీ చాలా ఆలస్యమైంది. చాలా మంది చెబుతుంటారు.. కష్టానికి తగిన ప్రతిఫలం ఊహించని విధంగా దక్కుతుందని. ఒక వేళ నేను ఈ విశ్వంతో మాట్లాడగలిగితే.. కొంచెం గ్యాప్ ఇవ్వమంటాను. ఎందుకంటే నాటు నాటు సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఆ సక్సెస్లోనే ఉన్నాం. ఇంతలో ఈ సక్సెస్. చాలా సంతోషంగా ఉంది.’ అని రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.