(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. 22వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న సీఎం జగన్..ప్రధాన మంత్రి నరేంద్ర మోది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్లను కలవనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై వారితో ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులను కోరనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుల ఓటింగ్ విషయంలో విపక్షాలతో పాటు యుపిఏలోని స్వపక్షీయులు కూడా వ్యతిరేకిస్తున్నా వైసీపీ అనుకూలంగా ఓటు వేస్తున్న విషయం తెలిసిందే. అనేక విషయాల్లో యుపిఏ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా నిలుస్తున్నది. ఈ కారణంగా రాష్ట్రానికి కేంద్రం నుండి ఆర్థిక తోడ్పాటు అందిపుచ్చుకోవాలని సిఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.