హైదరాబాద్, మార్చి 10: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యంది. సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తున్నారు. గత ప్యానెల్లో జనరల్ సెక్రెటరీగా పని చేసిన నరేష్.. శివాజీరాజాకు పోటీగా బరిలో నిలిచారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి ఎనిమిది గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అసోసియేషన్లో 745 మంది ఆర్టిస్ట్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు.
శివాజీరాజా ప్యానెల్లో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరణ్ సహా 25 మంది పోటీ చేస్తున్నారు.
అలాగే నరేశ్ ప్యానెల్లో జీవిత, రాజశేఖర్, శివ బాలాజీ సహా 26 మంది సభ్యులతో బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికలు రెండు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నటి హేమ పోటీ చేస్తున్నారు.
గత కార్యవర్గంలో జాయింట్ సెక్రటరిగా హేమ సేవలు అందించారు.