MAA Elections: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మా అసోసియేషన్ ఎన్నికల రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. ఊహించని ట్విస్ట్ లు అసోసియేషన్ లోని ప్యానెల్ నేతలు అయోమయానికి గురి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు మా అసోసియేషన్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. టాలీవుడ్ నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సంచలన నిర్ణయం ప్రకటించారు.
మా అసోసియేషన్ ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి బండ్ల గణేష్ బయటకి వచ్చారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటన విడుదల చేశారు. తాను జనరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు.
MAA Elections: మనస్సాక్షి మాట వినడం లేదు
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మనస్సాక్షికి ఎంత చెప్పినా మాట వినడం లేదు – నన్ను పోటీ చేయ్ అంటోంది, అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకే ఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా..అంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ తాజా నిర్ణయంతో మా ఎన్నికల ప్యానెల్ లో మరో సారి విబేధాలు బయటపడ్డాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి బండ్ల గణేష్ బయటకు ఎందుకు వచ్చారు. ఆయనతో గొడవ ఏమిటీ అనే వివరాలు బయటకు రాలేదు. బండ్ల గణేష్ ఇచ్చిన ట్విస్ట్ పై ప్రకాష్ రాజ్ ప్యానల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
ప్రస్తుత పాలకవర్గంపై సంచలన వ్యాఖ్యలు
ఇదే సందర్భంగా బండ్ల గణేష్ ప్రస్తుత పాలకవర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదనీ, ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరని పేర్కొన్నారు. ‘మాట తప్పను, మడమ తిప్పను, నాది ఒకటే మాట – ఒకటే బాట, నమ్మడం – నమ్మిన వారి కోసం బతకడం, నా మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకుంటాను, నేను ఎవరి మాట వినను, త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను, పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు బండ్ల గణేష్. తన పరిపాలన ఎంటో తెలియజేస్తూ వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం తన ధ్యేయమనీ, దాని కోసం పోరాడుతా, వారి సొంత ఇంటి కల నిజం చేస్తానని హామీ ఇచ్చారు బండ్ల గణేష్. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు, ఇక అలా జరగొద్దు, అందరి ఆశీస్సులు కావాలి, మా ను బలోపేతం చేద్దామని అన్నా బండ్ల గణేష్.
Read More: YS Sharmila: తెలంగాణలో సీఎం కేసిఆర్ అసలు లక్ష్యాన్ని బయటపెట్టిన వైఎస్ షర్మిల..!!