MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో తొలి నుండి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్న నిర్మాత బండ్ల గణేశ్ తాజాగా చేస్తున్న వరుస ట్వీట్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. తొలుత ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో ఉన్న బండ్ల గణేశ్ ..జీవితా రాజశేఖర్ ప్రకాశ్ రాజ్ ప్యానల్ లోకి వచ్చి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయడంతో ఆయన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించడంతో పాటు జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను జీవిత కు మాత్రమే వ్యతిరేకమనీ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కే తన మద్దతు అని తెలియజేసిన బండ్ల గణేశ్ స్వతంత్రంగా బరిలోకి దిగి నామినేషన్ వేసిన అనంతరం అనూహ్యంగా పోటీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు.
జీవిత ఫోటో కనిపించకుండా
ఆదివారం ఎన్నికలు జరగడానికి కొద్ది గంటల ముందు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ తన దైన రాజకీయం ప్రదర్శించారు బండ్ల గణేశ్, నిన్న రాత్రి మంచి విష్ణు ప్యానెల్ లోని ప్రధాన కార్యదర్శి అభ్యర్థి రఘుబాను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన బండ్ల గణేశ్ నేడు మరో ట్విస్ట్ ఇస్తూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానల్ కరపత్రం నుండి జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా ఉన్న జీవితా రాజశేఖర్ ఫోటో కనబడకుండా పూర్తిగా మార్క్ చేసి జీవిత పై తనకు ఉన్న కోపాన్ని మరో సారి వ్యక్త పరుచుకున్నారు బండ్ల గణేశ్. పోలింగ్ జరుగుతున్న వేళ బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
MAA Elections: రికార్డు స్థాయిలో పోలింగ్
మరో పక్క మా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది. గత ఎన్నికల్లో 458 ఓట్లు పోల్ కాగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 491 ఓట్లు పోల్ అయ్యాయి. మరో వంద ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయినీ, పోలింగ్ పూర్తి అయ్యే సమయానికి 600 దాటవచ్చని అభిప్రాయపడ్డారు సిట్టింగ్ అధ్యక్షుడు నరేశ్. చెన్నై, ముంబాయి తదితర ప్రాంతాల నుండి సినీ నటులు వచ్చేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న నటీ నటులు పోలింగ్ సందర్భంగా మీడియా వద్ద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికల అనంతరం అందరం ఒకే కుటుంబంగా కలిసి మెలసి ఉంటామని సినీ నటీనటులు పేర్కొంటున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ తో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు మంచు విష్ణు.