సాధారణంగా మ్యూజిషియన్ లు ఎన్నో ప్రదర్శనలు చేయడం మనం చూస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా ఇసుక బంగారంగా మారే మ్యాజిక్ చూశారా? అవును మీరు విన్నది నిజమే ఇసుక ద్వారా మ్యాజిక్ చేస్తే బంగారం వస్తుందంటూ ఘరానా మోసగాడు బంగారు వ్యాపారిని మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.తాను తీసుకు వచ్చిన ఇసుకను మండిస్తే స్వచ్ఛమైన బంగారం తయారవుతుందని మాయమాటలు చెప్పి ఏకంగా ఆ బంగారు వ్యాపారికి 50 లక్షల రూపాయల వరకు టోపీ పెట్టిన ఘటన పుణేలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
పుణేలోని ఓ బంగారు ఆభరణాల వ్యక్తి దగ్గరకు ఉంగరం కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు. అయితే సదరు వ్యక్తి షాపు యజమానితో సంవత్సరం పాటు మంచి పరిచయం ఏర్పర్చుకొని నమ్మకం పెరిగే విధంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా పాల ఉత్పత్తులను,బియ్యం తదితర వస్తువులను కొనుగోలు చేస్తూ, మంచివాడిగా నటించి అతని దగ్గర నమ్మకాన్ని పొందాడు.ఆ బంగారు వ్యాపారికి తనపై నమ్మకం వచ్చిన తర్వాత అసలు ప్లాన్ అమలు పరిచాడు నిందితుడు.
ఈ సందర్భంగానే తన దగ్గర ఉన్న ప్రత్యేకమైన ఇసుక గురించి ఆ వ్యాపారికి తెలియజేశాడు. తన దగ్గర ఉన్న ఇసుకను మండించడం వల్ల స్వచ్ఛమైన బంగారం తయారవుతుందని మాయ మాటలు చెప్పడంతో, సదరు బంగారు నగల వ్యాపారి సైతం అతని మాటలకు మోసపోయి, నాలుగు కిలోల ఇసుకను సుమారు 50 లక్షల రూపాయలు ఇచ్చి కొన్నాడు. ఇందుకు గాను ఆ వ్యక్తికి 30 లక్షల రూపాయలు నగదు ఇవ్వగా, 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ముట్టచెప్పి నాలుగు కిలోల ఇసుకను తీసుకున్నాడు. ఆ విధంగా ఇసుక కొనుక్కున్న తర్వాత అసలు విషయం బయట పడటంతో తాను మోసపోయానని భావించిన బంగారు వ్యాపారి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం పోలీసులకు తెలిపి అతని పై ఫిర్యాదు చేశాడు.