Maharashtra: ఆ నాయకుడు హోంశాఖ మంత్రిగా రాష్ట్రంలో చక్రం తిప్పారు. ఇప్పుడు ఓ కేసులో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎవరు అంటే మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం ఈడీ అధికారులు గాలిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నరనే విషయం ఈడీ అధికారులకు ఇంత వరకూ తెలియరాలేదు.
ఈడీ నుండి అనిల్ దేశ్ ముఖ్ కు ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు హజరు కావాలంటూ సమన్లు జారీ అయ్యాయి. కానీ అనిల్ దేశ్ ముఖ్, అతని కుమారుడు రుషికేష్ సోమవారం నాడు ఈడీ విచారణకు హజరు కావాల్సి ఉండగా ఆ విచారణకు వీరు గైర్హజరు అయ్యారు. వంద కోట్ల అక్రమ వసూళ్ల అంశంలో దేశ్ ముఖ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందే నాగపూర్, ముంబయిలోని ఆయన ఆస్తులపై దాడులు కూడా చేశారు. రూ.4.2 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. ఇప్పటికే దేశ్ ముఖ్ పీఎస్ సంజీవ్ పలాండె, పీఏ కుందన్ షిండేలను ఈడీ అరెస్టు చేసింది. మాజీ మంత్రి దేశ్ ముఖ్ కుమారుడు రుషికేశ్ కూడా ఈడీ అధికారులకు అందుబాటులోకి రాలేదు.