Maharashtra మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మరో అడుగు ముందుకేశారు.ఇప్పటికే ఆయన మహారాష్ట్ర హోం మంత్రిపై సంచలన అవినీతి ఆరోపణలు చేయడం తెలిసిందే .అంతటితో వెనక్కు తగ్గని సింగ్ తన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
ఎన్పీసీ నేత, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పరమ్బీర్ సింగ్. హోంమంత్రిపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై పక్షపాతం లేని,ప్రభావితం కాని,నిస్పక్షపాతమైన,న్యాయబద్దమైన దర్యాప్తు చేయించాలని పరమ్ బీర్ సింగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.అంతేకాకుండా, ముంబై పోలీస్ కమిషనర్గా తనను తప్పించి… హోంగార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని కూడా సవాల్ చేశారు పరమ్బీర్. తనను బదిలీని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టివేయాలని సింగ్ పిటిషన్ లో కోరారు. తన బదిలీని ఏకపక్షమైనదే కాక అక్రమమైనదని పరమ్ బీర్ సింగ్ పేర్కొన్నారు. కాగా ,అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు నేపథ్యంలో.. గత శుక్రవారం ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. పరమ్బీర్ సింగ్ స్థానంలో హేమంత్ నగ్రాలేను ముంబై పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది.
Maharashtra అసలు పరమ్ బీర్ సింగ్ లేఖ ఏంటి?
ఈ నేపధ్యంలో హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ పరమ్బీర్ సింగ్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకి శనివారం ఓ లేఖ రాశారు. నెలకు రూ.100 కోట్లు సంపాదించాలని ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన మాజీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ వాజేకు అనిల్ దేశ్ముఖ్ ఫిబ్రవరి మధ్యలో ఆదేశాలు జారీ చేశారని అన్నారు. బార్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూల్ చేయాలని చెప్పినట్లు ఆ లేఖలో సింగ్ తెలిపారు.
మంత్రి వివరణ ఏమిటంటే!
మరోవైపు, పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ స్పందించారు. తాను ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు అనిల్ దేశ్ముఖ్ తెలిపారు. ఫిబ్రవరి 28నే తన ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. అయితే.. హాస్పిటల్ నుంచి ఫిబ్రవరి 15న డిశ్చార్జ్ అయినప్పుడు కొంతమంత్రి జర్నలిస్టులు గేట్ వద్ద ఉన్నారని, తాను నీరసంగా ఉన్న కారణంగా అక్కడే కుర్చీలో కూర్చొని వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. ఆ తర్వాత నేరుగా కారులో ఎక్కి ఇంటికి వెళ్లానని తెలిపారు.
దేశ్ ముఖ్ కు మద్దతుగా నిలిచిన పవార్
ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్..హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను మద్దతుగా నిలిచారు. హోంమంత్రి కుర్చీ నుంచి అనిల్ దేశ్ ముఖ్ ను తొలగించే ప్రసక్తే లేదని పవార్ తేల్చిచెప్పారు. శరద్ పవార్ మాట్లాడుతూ..ఇక్కడ ముఖ్యమైన అంశం అంబానీకి బెదిరింపు కేసు. ఈ ఘటనలో ఏటీఎస్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో అంబానీకి బాంబు బెదిరింపు కేసుతో సంబంధం ఉన్న మన్ సుఖ్ హిరేన్ ను ఎవరు చంపారో సృష్టత వచ్చింది. దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటపడతాయి. ముంబై ఏటీఎస్ దర్యాప్తు సరైన దారిలో సాగుతోంది. అయితే దాన్ని తప్పుదారిబట్టించేందుకే పరమ్ బీర్ పింగ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. పరమ్ బీర్ సింగ్ సీఎంకి రాసిన లేఖను పరిశీలిస్తే.. పబ్బులు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూల్ చేయాలని ఫిబ్రవరి మధ్యలో తమకు హోంమంత్రి ఆదేశాలు ఇచ్చా౭రని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 6 నుంచి 16వ తేదీ వరకు అనిల్ దేశ్ ముఖ్ కరోనా బారినపడి హాస్పిటల్ లో చేరారు. ఆరోపణలు చేసిన సమయంలో హోంమంత్రి ఆసుపత్రిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరోపణలకు ఎలాంటి బలం లేదు. అవి నిరాధారమైనవని తేలింది. కాబట్టి అనిల్ దేశ్ ముఖ్ ను హోంమంత్రిగా తప్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో శివసేన నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పవార్ సృష్టం చేశారు.