Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం కాకరేపుతోంది. శివసేన చీలికవర్గం నేత, మంత్రి ఏక్ నాథ్ శిందేకి క్రమంగా బలం మరింత పెరిగింది. తాజాగా శిందే శిబిరానికి చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు తెలుస్తొంది. వీరిలో దాదాపు 40 మంది శివసేనకు చెందిన వారే ఉన్నారని ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిందే స్వయంగా వెల్లడించారు. తమపై నమ్మకం ఉన్న వారు చేతులు కలపవచ్చని, తాము బాలా సాహెబ్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తామని శిందే అన్నారు. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన నోటీసులు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెజార్టీగా ఉన్న తమను సస్పెండ్ చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ శిందే తమ నాయకుడుగా పేర్కొంటూ గవర్నర్, డిప్యూటి స్పీకర్ కు లేఖ లు రాశారు. ఉద్దవ్ ఠాక్రే వర్గం 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికే ఈ లేఖలు వెళ్లాయి. బలప్రదర్శనకు కూడా శిందే వర్గం సిద్ధమవుతోంది. శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సీఎం ఉద్దవ్ నిర్వహించిన సమావేశంలో తనతో సహా 13 మంది మాత్రమే హజరయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేలు చేజారిపోవడాన్ని గమనించిన ఉద్దవ్ ముందస్తుగానే రాజీనామా చేయడానికి సిద్దమంటూ ప్రకటించారు. అధికార సీఎం నివాసాన్ని ఖాళీ చేసి మాతోశ్రీకి వెళ్లిపోయారు.
మరో పక్క శిండే వర్గం ఇప్పటికే 400 మాజీ కార్పోరేటర్ లతో సమావేశం అయిన నేపథ్యంలో శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ జరపాలని ఉద్దవ్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీలు కూడా ఉద్దవ్ కు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో పార్టీని కాపాడుకునేందుకు ఉద్దవ్ జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. శివసేన చీలక వర్గం నేతలు అందరూ గుహవాటిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేయడంతో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి బయటి వారిని రెస్టారెంట్ లోకి అనుమతించడం లేదని తెలుస్తొంది.