భారత స్వాతంత్య్ర సమరయోధుడు, జాతిపతి, అహింసా వాది మహాత్మా గాంధీ కళ్లద్దాలకు వేలంలో భారీ ధర పలికింది. గాంధీజీ ఇకప్పుడు ధరించిన బంగారు పూత ఉన్న కళ్లద్దాలను వేలంలో భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. బ్రిటన్లో జరిగిన వేలంలో ఆ అద్దాలు ఏకంగా 3 లక్షల 40వేల ధర పలికాయి. మన కరెన్సీలో ఆ విలువ దాదాపుగా రూ.2.55 కోట్లు.
1920లో లేదా 1930లలో గాంధీజీ సౌతాఫ్రికాలో ఉన్నప్పుడు ఆ అద్దాలను ఆయన ఓ వ్యక్తికి ఇచ్చారు. అప్పట్లో మహాత్మా గాంధీ తాను వాడే కళ్లద్దాలను మారిస్తే పాత అద్దాలను ఎవరికైనా అవసరం ఉన్న పేదలకు ఇచ్చేవారట. అందులో భాగంగానే ఆయన వాటిని సౌతాఫ్రికాలో ఓ వ్యక్తికి ఇచ్చారు. అయితే ఆ తరువాత వ్యక్తికి చెందిన కుటుంబీకులు బ్రిటన్కు మారారు. దీంతో ఇటీవలే ఆ కుటుంబంలోని వారు ఆ అద్దాలను తీసుకువచ్చి అక్కడి ఓ సంస్థకు అప్పగించారు. వారు వాటిని వేలం వేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా వేలం కూడా నిర్వహించారు. వేలంలో అంత పెద్ద మొత్తానికి ఆ అద్దాలు అమ్ముడయ్యాయి.
అయితే ఆ అద్దాలను కలిగి ఉన్నవారు నిజానికి వాటిని పడేద్దామనుకున్నారట. కానీ వాటికి వేలం నిర్వహించాలని అనుకున్నారు. అందుకనే వారు వాటిని వేలంలో ఉంచారు. కానీ అనూహ్యంగా ఆ అద్దాలు భారీ ధర పలకడం విశేషం.