సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలకు సింహాభాగం అడ్వర్టైజ్మెంట్ (ప్రకటనలు) ఇచ్చుకోవడం రివాజే. ఇది కొత్తేమి కాదు. ఎప్పటి నుండో జరుగుతున్నదే.
గత టిడిపి హాయాంలో ప్రభుత్వ ప్రకటనలల్లో ఎక్కువ భాగం ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఆ తరువాత ఇతర పత్రికలకు ఇస్తుండే వారు. నాడు సాక్షి పత్రికకు చాలా తక్కువ మొత్తంలో ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలో ఏ దిన పత్రికకు ఎంత మొత్తంలో ప్రకటనల రూపంలో చెల్లించారు అని ఒక ఆర్ టి ఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగి సమాచారానికి రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా వివరాలు వెల్లడించింది.
రాష్ట్రంలో వైెఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిలో వివిధ పత్రికలకు ప్రకటనల రూపంలో వంద కోట్ల రూపాయలు చెల్లించింది. ఇందులో సాక్షి పత్రికకు 52 కోట్ల రూపాయలు, అదే మాదిరిగా మరో ప్రధాన దినపత్రిక ఈనాడుకు 39 కోట్ల రూపాయలు, ప్రజాశక్తికి 2.98కోట్లు, విశాలాంధ్రకు 1.87 కోట్లు, ఆంధ్రప్రభకు 2.15కోట్లు, ఆంధ్రభూమికి 50లక్షలు, వార్తకు 1.35 కోట్లు, ఆంధ్రజ్యోతికి 25లక్షల రూపాయల విలువైన ప్రకటనలు ఇచ్చారు. సమాచార హక్కు ద్వారా వచ్చిన ఈ వివరాలతో ఆంధ్రజ్యోతి ప్రభుత్వంపై తన అక్కసును వెల్లగక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సాక్షి పత్రికకు 52శాతం మేర ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారనీ ఆంధ్రజ్యోతికి మాత్రం కేవలం 0.25 శాతం మాత్రమే అంటే 25లక్షలు మాత్రమే ఇచ్చారని తమ ఆవేదనను వెల్లబోసుకున్నది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత టిడిపి ప్రభుత్వ హయాంలో వారం వారం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇస్తుండేవారు. టిడిపి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి లకు సుమారు 550 నుండి 600 కోట్ల రూపాయల విలువైన అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చినట్లు అనధికార సమాచారం. నాడు సాక్షి పత్రికకు నామ మాత్రంగానే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు. అప్పుడు ఈ పత్రిక కూడా యాడ్స్ విషయంలో ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ కథనాలు ఇచ్చిందనుకోండి. అది వేరే విషయం. అప్పుడు వారు తక్కువ యాడ్ లు వస్తున్నాయని బాధపడ్డారు. ఇప్పుడు వీరు బాధపడుతున్నారు. అంతే తేడా. అప్పుడు టిడిపి ప్రభుత్వం ప్రకటనల విషయంలో తప్పు చేసింది, పక్షపాతం చూపింది అంటే ఇప్పుడు వైసిపి ప్రభుత్వం కూడా అదే దారిలో ఉన్నట్లు లెక్క. అంతే నంటారా?.