విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్ ర్యాంక్ కీలక పదవి వరించింది. ఏపి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు నియమితులైయ్యారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిలో మల్లాది విష్ణు కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన మల్లాది విష్ణు …2009లో తొలి సారిగా విజయవాడ సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగిన మల్లాది విష్ణు వైఎస్ఆర్ మరణానంతరం చాలా కాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో సెంట్రల్ నుండి పోటీ చేసినా మూడవ స్థానంలో నిలిచారు. ఆ టీడీపీ అభ్యర్ధి బొండా ఉమా వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గౌతం రెడ్డి పై విజయం సాధించారు.
2019 ఎన్నికలకు కాస్త ముందుగా మల్లాది విష్ణు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వంగవీటి రాధా కృష్ణ, మల్లాది విష్ణు ఇద్దరూ అభ్యర్ధిత్వం కోసం పోటీపడగా జగన్ .. మల్లాది విష్ణుకు కేటాయించారు. ఆ నేపథ్యంలోనే వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి బొండాా ఉమాపై స్వల్ప ఓట్ల ఆధిక్యతతో మల్లాది విష్ణు గెలిచారు. బ్రాహ్మణ సామాజిక వర్గ కోటాలో జగన్ మొదటి మంత్రివర్గంలో విష్ణు చోటు లభిస్తుందని భావించారు. అయితే విజయవాడ నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వడంతో సాధ్యపడలేదు. దాంతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయనకు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవితో పాటు టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా సభ్యుడుగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో మల్లాది విష్ణుకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు తాజాగా కేబినెట్ ర్యాంక్ తో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి లభించడం గమనార్హం.