Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సురక్షితమైన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.తాజా ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించినప్పటికీ ఆమె మాత్రం నందిగ్రామ్ లో ఓడిపోవటం తెలిసిందే.పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఓటమి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.నిజానికి మమతా బెనర్జీకి కూడా ఈ పరాజయం జీర్ణించుకోలేనిదే.
తన కటౌట్లు పెట్టి రెండొందలమంది ని గెలిపించిన మమతా బెనర్జీ తను స్వయంగా ఓడిపోవడాన్ని తీవ్రంగానే తీసుకున్నారు.టీఎంసీ లో తనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సువేందు అధికారి చేతిలో ఓటమి పాలుకావడం మమతా బెనర్జీకి మరో అవమానం.ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సువేందు నందిగ్రామ్ లో మమతను ఓడించారు. ఆఖరి రౌండ్లో మమతా బెనర్జీ కి వెయ్యి ఓట్ల ఆధిక్యత ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఎన్నికల సంఘం ఆ ఫలితాన్ని ప్రకటించలేదు. రెండు గంటల తర్వాత ఆమె పన్నెండొందల ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు సువేందు గెలిచినట్టు అధికారికంగా ప్రకటించారు.దీని పైన మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు.ఏదేమైనప్పటికీ మమతా బెనర్జీ మళ్లీ సీఎంగా ఉన్నందున రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరునెలల లోపు తిరిగి అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది.
Mamata Banerjee: భవానీపూర్ నుంచే బరిలోకి!
ఈ నేపధ్యంలో ఆమె తిరిగి తన పాత నియోజకవర్గం భవానీపూర్ నిబ అసెంబ్లీలో రీఎంట్రీకి సురక్షితమైన నియోజకవర్గంగా ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.2011,2016 ఎన్నికల్లో ఆమె ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.మొన్నటి ఎన్నికల్లోనే నందిగ్రామ్ కు షిఫ్ట్ అయి పరాజయం పాలయ్యారు.ఇంకోసారి రిస్క్ తీసుకునే ఉద్దేశం లేకుండా మమతా బెనర్జీ మళ్ళీ భవానీపూర్ దారి పట్టనున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.ఉప ఎన్నిక కోసం ప్రస్తుతం భవానీపూర్ లో గెలుపొందిన టీఎంసీ ఎమ్మెల్యే సొవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ తన పదవికి రాజీనామా చేయగా పార్టీ సైతం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే ఆయన అసెంబ్లీ స్పీకర్ కి తన రాజీనామా పత్రం సమర్పిస్తారని కూడా తెలుస్తోంది.అయితే బీజేపీ ఇక్కడ కూడా ఆమెను అంత సులువుగా గెలవనిస్తుందా అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. మళ్లీ హోరాహోరీ పోరు తప్పకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.