Prashant Kishor : ఒకప్పుడు కమ్యూనిస్ట్ల కంచుకోట వెస్ట్ బెంగాల్. 34 ఏండ్ల పాటు ఏకధాటిగా పాలించిన ఆ పార్టీని మమతా బెనర్జీ ఒంటిచేత్తో మట్టికరిపించారు.
మొదట్లో కాంగ్రెస్లో ఉన్న ఆమె 1997లో సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి తన పోరాటాలతో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. 2011లో లెఫ్ట్ సర్కారును దించి బెంగాల్ సీఎం అయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలోనూ బలం పుంజుకున్న బీజేపీ ఆమెకు స్ట్రాంగ్ అపోజిషన్గా మారింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్య నువ్వా, నేనా అన్నట్టు టఫ్ ఫైట్ ఉండబోతోంది. బీజేపీ బలాన్ని ఎదుర్కొని మమత మళ్లీ సీఎం అయ్యి హ్యాట్రిక్ కొట్టడం అన్నది కష్టంగానే కనిపిస్తోంది.
Prashant Kishor : ఫస్ట్ టర్మ్ సూపర్ హిట్ !
పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల టైమ్లో మమతా బెనర్జీకి ఏ పార్టీ ఎదురు నిలవలేకపోయింది. 2011లో గెలిచాక ఆమె ఫస్ట్ టర్మ్ పాలనపై ప్రజల నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. దీంతో 2016 ఎన్నికల్లో 294 సీట్లకు గానూ 211 చోట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే 2014లో మోడీ నేతృత్వంలో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఆ తర్వాత అన్ని రాష్ట్రాలపై పట్టు సాధించడం మొదలుపెట్టింది. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. 2019 లోక్సభ ఎన్నికల నాటి బీజేపీ బలమైన ప్రతిపక్షం స్థాయికి చేరింది. ఆ రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాల్లో 18 చోట్ల గెలిచి సత్తా చాటింది. మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ ఈ ఏడాదిలో రాబోయే ఎన్నికల్లో ఆల్టర్నేటివ్గా ప్రజల్లో గుర్తింపు పొందే స్థాయికి ఎదిగింది.
Prashant Kishor : ఎందుకు ఎదురుగాలి వీస్తోంది?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బెంగాల్లో ఇప్పటి వరకూ వారసత్వ రాజకీయాలన్నవి లేవు. కానీ తొలిసారి మమతా బెనర్జీ తన పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్లో తన తర్వాత స్థానం ఇస్తున్నారు. ఇది బెంగాల్ ఇమేజ్ను దెబ్బతిస్తోందన్న ఫీలింగ్ ఆ పార్టీ నేతల్లో ఉంది. మరోవైపు పార్టీలో మమత తర్వాత సెకండ్ ప్లేస్ అనే స్థాయికి ఏ ఒక్క నేతనూ ఎమర్జ్ కానీయకుండా చేయడంపైనా తృణమూల్ సీనియర్ లీడర్స్ అంతా గుర్రుగా ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు, యాక్టర్స్ ఉన్నా.. ఎవరికీ యాక్టివ్ రోల్ ఇవ్వడం లేదు. ఇటీవల సీనియర్ నేతలు, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేసి బీజేపీలో చేరుతుండడం చూస్తేనే రాష్ట్రంలో మమత, తృణమూల్ ఇమేజ్ ఎంతగా డౌన్ అయిందన్నది అర్థం చేసుకోవచ్చు. ఆ పరిణామాలతో దీదీలో భయం మొదలైంది. ఆమె రెండు చోట్ల పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది.
ఆమె తీరే ఆమెకు శత్రువు
మమతా బెనర్జీ చాలా అగ్రెసివ్ లీడర్. ఆమె నిత్యం కేంద్రంతో గొడవలకు దిగుతూ, కాంట్రవర్సీలకు సెంటర్గా మారారు. కొంత కాలం మాత్రమే ఈ తీరును ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలు చేస్తే ప్రజలు స్వాగతిస్తారు. కానీ అధికారంలోకి వచ్చాక అదే తీరు కంటిన్యూ చేయడం వల్ల అభివృద్ధి దూరమయ్యామన్న ఫీలింగ్ ప్రజల్లో ఉంది. అగ్రెసివ్నెస్ వల్ల ఆమె తనకు తానే శత్రువుగా మారారు. ఈ రకమైన అగ్రెసివ్, కాంట్రవర్షియల్ లీడర్లకు ఓటమి తప్పదని చరిత్ర చెబుతోంది. 24 ఏండ్ల పాటు సీఎంగా చేసిన జ్యోతి బసు చాలా డిగ్నిఫైడ్ మ్యాన్, కానీ నిత్యం కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ పోవడం వల్ల ఓటమి పాలయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిన నవీన్ పట్నాయక్ లాంటి నేతలే ఎక్కువ కాలం పదవిలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తించాలి.
పీకే గట్టెక్కించేనా?
ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్ను ఈ ఎన్నికల్లో తన సలహాదారుగా మమతా బెనర్జీ నియమించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల ప్రణాళికలను ఆయన సాయంతో తృణమూల్ సిద్ధం చేసుకుంటోంది. 2011 ఎన్నికల టైమ్లో సీపీఎం, కాంగ్రెస్ బెంగాల్లో బలమైన రాజకీయ పక్షాలు. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు పూర్తిగా వీక్ అయ్యాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి 6% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఈ టైమ్లో అవి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేవు. గతంలో శత్రువులుగా ఉన్న ఆ పార్టీలను ఇప్పుడు ఉమ్మడి శత్రువైన బీజేపీపై పోరాడేందుకు మమత పొత్తుకు యత్నిస్తున్నారు. యాంటీ బీజేపీ, ముస్లిం ఓట్లు చీలకుండా చూసుకోవచ్చన్నది ఆమె ఉద్దేశం.అయితే ఇవన్నీ ఒకెత్తు .బెంగాలీలు మార్పు కోరుకుంటున్నారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఒకవేళ వాళ్లు మార్పు కోరుకుంటే మమతకు సీఎంగా హ్యాట్రిక్ మిస్ అవ్వడం ఖాయం..