వాక్సిన్ వచ్చేస్తుంది. కరోనా పోతుంది. చింతలేదు అనుకుంటున్నా తరుణంలో ఓ సంఘటన కొత్త ఆందోళనలు కలిగిస్తుంది. భారత్ బయోటెక్ విడుదల చేసిన “కోవాక్సిన్” క్లినికల్ ట్రయల్స్ లో టీకా వేసుకున్న ఓ వ్యక్తి మరణించడం ఇప్పుడు దేశంలో కొత్త ఆందోళనకు తావిస్తుంది..! వివరాల్లోకి వెళ్తే..!!
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కి చెందిన దీపక్ మారబి అనే 42 ఏళ్ళ వ్యక్తి డిసెంబర్ 12 న భారత్ బయోటెక్ విడుదల చేసిన “కోవాక్సిన్” క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. మూడోదశ టీకా వేయించుకున్నారు. ఆయన డిసెంబర్ 21 న మరణించారు. ఆయన మరణంపై ఇప్పుడు సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి. “వాక్సిన్ తేడా కొట్టి దీపక్ చనిపోయారు” అంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ భారత్ బియోటెక్ ప్రతినిధులు మాత్రం “దీపక్ లో గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అతని శరీరంలో విష పూరితమైన పదార్ధం ఉండడం వలనే మరణించారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. నిజాలు తెలుస్తాయి” అంటూ ప్రకటన విడుదల చేసారు. ఈ మరణంపై పీపుల్స్ మెడికల్ కాలేజీ ప్రతినిధి రాజేష్ కపూర్ కూడా భిన్నంగా స్పందించారు. “అతని మరణంపై పోస్ట్ మార్టం నివేదికలు పరిశీలిస్తున్నాం. టీకా వలన చనిపోయారు అనడానికి ఆధారాలు లేవు. అతని దేహానికి మళ్ళీ వెస్కార పరీక్ష చేస్తాం” అన్నారు. ఈ అంశం ఇప్పుడు మధ్య ప్రదేశ్ లో సంచలనంగా మారింది అంటూ పీటీఐ కథనంలో పేర్కొంది. దీనిపై స్పందించేందుకు మధ్య ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి అందుబాటులో లేరు అంటూ పీటీఐ కథనంలో చెప్పింది.
అనుమానాలు మొదటి నుండీ..!!
కరోనా వాక్సిన్ పై అనుమానాలు ఇప్పుడే కొత్త కాదు. రెండు నెలల కిందట కూడా సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన టీకా ప్రయోగాల్లో పాల్గొన్న ఓ యువకుడికి తేడా కొట్టింది. తల నొప్పి, వాంతులుతో తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్టు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ పై వాళ్ళు అనేక ఆరోపణలు చేసారు. దీంతో సీరం కూడా ఘాటుగా స్పందించి అతనిపై పరువు నష్టం దావా వేసింది. తాజాగా ఇప్పుడు భారత్ బియోటెక్ టీకాపై అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఈ రెండు టీకాల పట్ల ఇలా అనుమానాలు ఉండగానే.. ఈ నెల 16 న దేశీయంగా మొత్తం విడుదలకు కేంద్రం సిద్ధమవుతోంది..!!